Begin typing your search above and press return to search.

యాక్సిడెంట్ రోజు రాజ‌శేఖ‌ర్ నిద్ర మాత్ర‌లు మింగారట‌!

By:  Tupaki Desk   |   10 Oct 2017 12:45 PM GMT
యాక్సిడెంట్ రోజు రాజ‌శేఖ‌ర్ నిద్ర మాత్ర‌లు మింగారట‌!
X
ఆదివారం అర్ధ‌రాత్రి హీరో రాజ‌శేఖ‌ర్ త‌న కారుతో మ‌రో కారును ప్ర‌మాద‌వ‌శాత్తు ఢీకొట్టిన సంగ‌తి తెలిసిందే. పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఆరాంపూర్ స‌మీపంలో ఈ రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో రాజ‌శేఖ‌ర్ తాగి లేర‌ని పొర‌పాటున యాక్సిడెంట్ చేశార‌ని జీవిత చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌నకు గాయాలేమీ కాలేద‌ని - క్షేమంగా ఉన్నార‌ని - అభిమానులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని జీవిత మీడియా ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు. యాక్సిడెంట్ త‌ర్వాత‌ రాజ‌శేఖ‌ర్ ను పోలీసులు విచార‌ణ చేశారు. అనంత‌రం ఆయ‌న ఇంటికి వెళ్లిపోయారు. అయితే, ఆ ప్ర‌మాద‌ ఘ‌ట‌న రాత్రి ఏం జ‌రిగింద‌నే వివ‌రాలను మంగ‌ళ‌వారం పోలీసులు వెల్ల‌డించారు. తన తల్లి చనిపోయిందన్న మానసిక ఒత్తిడిలో రాజ‌శేఖ‌ర్ నిద్రమాత్రలు మింగి మత్తులోనే కారు నడిపార‌ని పోలీసులు తెలిపారు. సోమవారం రాజశేఖర్‌ ఇంట్లో ఆమె త‌ల్లి ఆండాళ్‌ దశదినకర్మ కార్యక్రమం ఉంది. ఆమె త‌ల్లి మ‌ర‌ణం త‌ర్వాత డిప్రెష‌న్ లో ఉన్న రాజ‌శేఖ‌ర్ మూడీగా ఉంటున్నారు. ఇది గ‌మనించిన కుటుంబ సభ్యుల‌కు - ఆయ‌న‌కు మ‌ధ్య ఆదివారం రాత్రి స్వ‌ల్ప వాగ్వాదం జ‌రిగింది.

దీంతో, అప్ప‌టికే నిద్ర మాత్ర‌లు మింగి ఉన్న రాజ‌ శేఖ‌ర్ కారు తీసుకొని బ‌య‌ట‌కు వెళ్లారట. ఆ త‌ర్వాత వెంట‌నే రాజశేఖర్‌ కుటుంబ సభ్యులు 100కు ఫోన్ చేసి ఆయన పరిస్థితిని వివరించారు. అయితే, పోలీసులు రాజ‌శేఖ‌ర్ ను ట్రేస్ చేసేలోపే పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే పై రామిరెడ్డి కన్‌ స్ట్రక్షన్‌ అధినేత రామిరెడ్డి కారును ఢీకొట్టారు. రామిరెడ్డి....పోలీసులకు స‌మాచారం అందించ‌డంతో రాజశేఖర్ ను రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ కు తరలించి బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు చేశారు. ఆ ప‌రీక్ష‌లో 20 శాతం రీడింగ్ న‌మోదైంది. రాజశేఖర్‌ భార్య జీవిత - కుమార్తెలు...పోలీసుల‌కు - రామిరెడ్డికి రాజ‌శేఖ‌ర్ డిప్రెష‌న్ లో ఉన్నార‌ని వివ‌రించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న రామిరెడ్డి ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను బాధితుడు రామిరెడ్డి వెల్ల‌డించారు. శంషాబాద్‌ లో ఓ రిసెప్షన్‌ కు హాజరై అత్తాపూర్‌ కు వెళ్తున్నాన‌ని రామిరెడ్డి తెలిపారు. ఆరాంఘర్‌ ఫ్లైఓవర్ దాటిన త‌ర్వాత ఓ కారు అదుపుత‌ప్పి డివైడర్‌ ను ఢీకొట్టింద‌ని, ఆ కారు డ్రైవ‌ర్ కు గుండెపోటు వచ్చింద‌ని భావించామ‌ని రామిరెడ్డి చెప్పారు. ఆ కారు ద‌గ్గ‌రికి డ్రైవ‌ర్ ను పంపాన‌ని, ఆ లోపే ఆ కారు వేగంగా వ‌చ్చి త‌మ‌ కారును ఢీకొట్టింద‌ని తెలిపారు. అపుడు ఆ కారు నడుపుతున్న వ్య‌క్తి హీరో రాజశేఖర్ అని గుర్తించామ‌ని చెప్పారు. ఆయ‌న‌ ప్రవర్తన కొద్దిగా తేడాగా ఉండ‌డంతో రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించామ‌న్నారు. పోలీసు స్టేషన్ లో రాజ‌శేఖ‌ర్ కు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షలు చేయ‌గా 20 శాతం రీడింగ్‌ వచ్చిందన్నారు. వాళ్ల అమ్మ చనిపోయినప్పటి నుంచి ఆయ‌న డిప్రెష‌న్ లో ఉన్నార‌ని జీవిత గారు చెప్పడంతో మానవతా దృక్పథంతో ఫిర్యాదు చేయలేద‌ని రామిరెడ్డి చెప్పారు.