Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌పై బీజేపీ క‌న్ను.. ఒక్కొక్క‌రిపై వ‌ల‌.. తాజాగా నితిన్‌!

By:  Tupaki Desk   |   27 Aug 2022 3:36 AM GMT
టాలీవుడ్‌పై బీజేపీ క‌న్ను.. ఒక్కొక్క‌రిపై వ‌ల‌.. తాజాగా నితిన్‌!
X
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల‌ని.. ల‌క్ష్యంగా పెట్టుకున్న నేప‌థ్యంలో తాజాగా సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ముఖ్యంగా సినిమా రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది.

వరంగల్‌లో శనివారం జరిగే ప్రజాసంగ్రామ యాత్ర బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తోన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సినీ ప్రముఖులు కలవబోతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సినీ నటుడు నితిన్ ఆయనతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. నితిన్‌తో పాటు సినీ ప్రముఖులు, రచయితలు నడ్డాను కలుసుకోనున్నారు.

క్రీడారంగానికి చెందిన ప్రముఖులు కూడా నడ్డాతో సమావేశమౌతారు. ఈ సంద‌ర్భంగా నితిన్‌ను పార్టీలో చేర్పించే ప్ర‌య‌త్నం సాగుతోంద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. టాలీవుడ్‌లోని చాలా మంది హీరోల‌ను ఇప్ప‌టికే బీజేపీ నాయ‌కులు సంప్ర‌దించిన‌ట్టు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో తెలుగు హీరోలతో బీజేపీ వరుస భేటీలు జరుపుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవలే ఎన్టీఆర్‌తో సమావేశమయ్యారు. భేటీ మర్యాదపూర్వకమే అని చెబుతున్నా రాజకీయపరమైన చర్చ వచ్చి ఉండొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తోన్న కమలనాథులు తెలుగునాట సినిమాకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పావులు కదుపుతున్నారు. సినీ రంగంలో ఉన్న ప్రముఖులను ప్రచారానికి ఉపయోగించడంతో పాటు ఆసక్తి ఉన్నవారికి టికెట్లు కూడా ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. సీనియర్ నటుడు కృష్ణంరాజు మొదలుకొని నరేశ్, సాయికుమార్ దాకా ఎందరో నటులు బీజేపీతో అనుబంధం కలిగినవారే.

జయప్రద కూడా ఇటీవలే బీజేపీలో చేరారు. స‌హ‌జ‌న‌టి జయసుధ కూడా చేరతారని ప్రచారం జరిగింది. మొత్తానికి బీజేపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.