Begin typing your search above and press return to search.

హైదరాబాద్ : వీకెండ్ ను కబ్జా చేసిన వరుణుడు

By:  Tupaki Desk   |   9 Oct 2022 5:40 AM GMT
హైదరాబాద్ : వీకెండ్ ను కబ్జా చేసిన వరుణుడు
X
వరుణుడు ఉగ్రరూపాన్ని చూపించారు. వీకెండ్ వేళ సాయంత్రం నాలుగు గంటల సమయంలో మొదలైన వర్షం రాత్రి అయ్యేసరికి వేలాది మంది హైదరాబాదీయులకు ప్రత్యక్ష నరకాన్ని చూపించింది. సాయంత్రం వేళలో తీక్షణమైన ఎండ ఓవైపు.. మరోవైపు సూదుల్లా ఆకాశం నుంచి పడుతున్న వర్షపు ధారతో ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిన పరిస్థితి. వర్షం జోరు పెరుగుతున్నా.. ఎండ తీవ్రత అలానే ఉండటం పలువురు ఆశ్చర్యానికి గురి చేసింది. సాయంత్రం ఐదున్నర అయ్యేసరికి వెలుగులు జిమ్మే సూరీడు సల్లగా జారుకుంటే.. వరుణుడు తన ఉగ్రరూపాన్ని చూపించటం మొదలు పెట్టాడు.

చూస్తుండగానే గడియారంలో ముల్లు కదిలే కొద్దీ.. వర్షపు తీవ్రత పెరగటమే కానీ తగ్గని పరిస్థితి. దీంతో.. వీకెండ్ వేళ.. నగర జీవులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. అన్నింటికి మించి దసరా రోజు ఊళ్లకు వెళ్లిన వారిలో అత్యధికులు శనివారం సాయంత్రానికి నగర శివారుకు చేరుకోవటం.. సిటీలోకి వచ్చే వేళలో విరుచుకుపడిన వానతో గంటల తరబడి రోడ్ల పక్కనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో.. ఆగమాగమయ్యే పరిస్థితి. నాలుగు గంటల పాటు దంచి కొట్టిన వానతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయం కావటంతో పాటు.. లోతట్టు కాలనీలు.. శివారు బస్తీలు జలమయం అయ్యాయి.

అంతేనా.. సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్ తో పాటు.. మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతి ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ లోని వసంత్ నగర్.. మణికొండ.. షేక్ పేట.. లంగర్ హౌస్.. ఫిలింనగర్.. ఖైరతాబాద్.. అత్తాపూర్ లాంటి ఎన్నో ప్రాంతాలు వాన ధాటికి చిగురుటాకుల మాదిరి వణికాయి. పీవీ నర్సింహరావు ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ 191 వద్ద మోకాలి లోతు వరకు వర్షపు నీరు నిలిచిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సరిగ్గా సాయంత్రం వేళలో మొదలైన వర్షం కారణంగా.. అప్పటికే రోడ్ల మీదకు వచ్చిన వారు.. వర్షం పడినా గంట.. రెండు గంటల్లో అంతా సర్దుకొంటుందని భావించి బయటకు వచ్చిన వారంతా అడ్డంగా బుక్ అయ్యారు. హైదరాబాద్ లోని నాలుగు వైపులా వర్షం ధాటిగా కురవటంతో వర్షపు నీరు రోడ్లును కప్పేసిన పరిస్థితి. ఇప్పటికే పడిన వర్షాల కారణంగా రోడ్లు మొత్తం గుంతల మయం కావటంతో.. ముందు ఏముందో అన్న సందేహంతో ఆచితూచి అన్నట్లుగా కదిలే వాహనాలతో ట్రాఫిక్ కాసేపటికే గ్రిడ్ లాక్ అయిపోయింది. ఇలాంటి వేళ ఫ్లైఓవర్ల మీద ట్రాఫిక్ లో చిక్కుకున్న వారి పరిస్థితి మాటల్లో వర్ణించలేనంత ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షంతో రోడ్ల మీద ట్రాఫిక్ నిలిచిపోవటంతో చాలామంది మెట్రోను ఆశ్రయించారు. దీంతో మెట్రోలని పలు ప్రధాన స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ముఖ్యమైన స్టేషన్లు మొత్తం ప్రయాణికులతో నిండిపోయాయి. అత్యధికంగా షేక్ పేటలో 13.6 సెంటీమీటర్ల వర్షం కురవగా.. మాదాపూర్ కాకతీయ హిల్స్ 12.7 సెంటీమీటర్ల వర్షం పడగా.. మరిన్ని ప్రాంతాలు 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. మొత్తంగా మరోసారి కురిసిన భారీ వర్షంతో హైదరారాబాద్ నరకంగా మారింది. పలు చోట్ల రోడ్ల మీద నిలిపిన కార్లు వర్షం దాటికి కొట్టుకెళ్లినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి అధికార వర్గాల నుంచి సమాచారం రావాల్సి ఉంది.