Begin typing your search above and press return to search.

గుజరాత్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత

By:  Tupaki Desk   |   10 Nov 2021 2:32 PM GMT
గుజరాత్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత
X
దేశంలో అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. గుజరాత్ లోని ద్వారకా లోని ఓ ఇంటి నుంచి భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. గుజరాత్ లోని ద్వారకాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ద్వారకా ఖంబాలియా రహదారిపై వెళ్తున్న ఓ కారు నుంచి భారీ మొత్తం లో మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపుగా వందల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల గుజరాత్ లోని ముంద్రా పోర్టులో మూడు వేల కిలోల మాదకద్రవ్యాలు దొరకడం కలకలం రేపింది.

ఈ నేపథ్యం లో మరోసారి డ్రగ్స్ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. ముంద్రా పోర్టులో దొరికిన డ్రగ్స్ విలువ రూ.21 వేల కోట్లుగా ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ వ్యవహారంపై ఎన్ ఐ ఏ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు 9 మంది అరెస్టు అయ్యారు. ఇందులో నలుగురు అఫ్గాన్ పౌరులు కాగా, ఒకరు ఉజ్బెకిస్థాన్ కు చెందిన నిందితుడు ఉన్నాడు. వీరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ తో కలిపితే మొత్తం సీజ్ చేసిన హెరాయిన్ 3,004 కేజీలు దాటింది.

గుజరాత్ ముంద్రా పోర్టు లో డ్రగ్స్ వ్యవహారాన్ని డీఆర్ ఐ అధికారులు బయటపెట్టారు. సెప్టెంబర్ లో గుజరాత్‌ ముంద్రా పోర్టులో రెండు కంటైనర్లలో డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. 2,988 కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నారు. డ్రగ్స్‌ని అఫ్గనిస్తాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా భారత్‌కు తరలించినట్టు అధికారులు గుర్తించారు. టాల్క్‌ స్టోన్స్‌, టాల్కం పౌడర్‌గా పేర్కొంటూ డ్రగ్స్‌ ని భారత్‌ కు రవాణా చేశారు. అయితే డీఆర్‌ఐ విచారణలో నార్కోటిక్‌ డ్రగ్‌ హెరాయిన్‌ గా నిర్థారించారు.

భారీ ఎత్తన డ్రగ్స్‌ పట్టుబడటంతో డీఆర్‌ ఐ దేశవ్యాప్తంగా ఆపరేషన్‌ చేపట్టింది. న్యూఢిల్లీ, నోయిడా, చెన్నై, కోయంబత్తూరు, అహ్మదాబాద్‌, మాండ్వి, గాంధీధామ్‌, విజయవాడ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఢిల్లీలో 16.1 కేజీల హెరాయిన్‌, నోయిడాలోని నివాస ప్రాంతాల్లో 10.2 కేజీల కొకైన్‌, 11 కేజీల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు అఫ్గనిస్తాన్‌ దేశస్తులు, ఒక ఉబ్జెకిస్తాన్‌ దేశస్తుడితో పాటు ముగ్గురు ఇక్కడి వారు మొత్తం 8 మంది పట్టుబడ్డారు. డీఆర్‌ ఐ అధికారులు వారందరినీ అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఇంపోర్ట్‌, ఎక్స్‌పోర్ట్‌ లైసెన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.ఆషి ట్రేడింగ్‌ కంపెనీ యాజమాన్యం డీఆర్‌ఐ కస్టడీలో ఉన్నారు. చెన్నైలో ఎం సుధాకర్‌, జి దుర్గాపూర్ణ, వైశాలిని అరెస్ట్‌ చేశారు. వీరిని గుజరాత్‌లోని భుజ్‌ కోర్టులో హాజరు పరిచారు. వీరిని 10 రోజుల పాటు డీఆర్‌ఐ కస్టడీకి అంగీకరించింది న్యాయస్థానం. తాజాగా ఈ కేసులో మనీ లాండరింగ్‌ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది.