Begin typing your search above and press return to search.

దేవుళ్ల‌కు చ‌లేస్తోంద‌ని హీట‌ర్లు పెట్టారు!

By:  Tupaki Desk   |   21 Dec 2017 11:15 AM GMT
దేవుళ్ల‌కు చ‌లేస్తోంద‌ని హీట‌ర్లు పెట్టారు!
X
ప్ర‌స్తుతం దేశంలోని అన్ని ప్రాంతాల‌లో చ‌లిపులి పంజా విసురుతోన్న సంగ‌తి తెలిసిందే. అందులోనూ ప్ర‌త్యేకించి ఉత్త‌రాది ప్రాంతాల‌లో చ‌లి తీవ్ర‌త అధికంగా ఉంటుంది. ఉత్త‌రాదిలో కొన్ని ప్రాంతాల‌లో మైన‌స్ డిగ్రీల‌లో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు చ‌లికి గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. చ‌లి పులి బారి నుంచి ర‌క్ష‌ణ పొంద‌డానికి ర‌క‌ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ప్ర‌జ‌లంద‌రూ ఎలాగోలా తిప్ప‌లు ప‌డి ఇళ్లలో వెచ్చ‌గా ఉంటున్నారు. మ‌రి - గుళ్ల‌లోని దేవుళ్ల ప‌రిస్థితి ఏమిటి? వారికి కూడా చ‌లి వేస్తుంది క‌దా? అయోధ్య‌లోని ఓ దేవాలయ అర్చ‌కుడిని ఈ ప్ర‌శ్న వేధించ‌సాగింది. దీంతో, స‌ద‌రు అర్చ‌కుడు `దేవుళ్ల‌`ను వెచ్చ‌గా ఉంచేందుకు....గ‌ర్భ‌గుడిలో హీట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

అయోధ్య‌లోని 'జానకి ఘాట్ బడాస్థాన్' ఆలయంలో దేవుళ్లకు చలేస్తుందని ఆ ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడు మ‌హంత్ జ‌న్మేజ‌య్ శ‌రణ్ భావించారు. `దేవుళ్ల‌`ను వెచ్చ‌గా ఉంచేందుకు గర్భగుడిలో హీటర్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు, గ‌ర్భ‌గుడిలోని దేవుళ్ల విగ్రహాలకు అభిషేకం చేసేందుకు వేడినీళ్లు ఉపయోగిస్తున్నారు. దేవుళ్లకి కూడా చలేస్తుందని భావించి ఈ ఏర్పాట్లన్నీ చేశామని జన్మయ్ మీడియాకు తెలిపారు. ఈ విష‌యాన్ని ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్ అయింది. ఆ ఆల‌య అర్చ‌కుడి కోస‌మే ఆ హీట‌ర్ ఏర్పాటు చేసుకున్నాడ‌ని - వాస్త‌వాలు ఒప్పుకోవాల‌ని - దేవుడి పేరు చెప్పి మ‌నుషులు సౌక‌ర్య‌లు పొందుతున్నారని ఒక‌రు ట్వీట్ చేశారు. ఇది చాలా వింతగా ఉంద‌ని, మ‌నుషుల‌కు దేవుళ్లు అన్ని సౌక‌ర్యాలు ఇస్తార‌ని - స‌క‌ల‌కాల స‌ర్వావ‌స్థ‌ల్లో త‌న‌ను తాను ఎలా ర‌క్షించుకోవాలో దేవుడికి తెలుస‌ని - త‌న‌ను గుర్తు పెట్టుకొని - గౌర‌విస్తే చాల‌ని మాత్ర‌మే దేవుడు కోరుకుంటాడ‌ని మ‌రొకరు ట్వీట్ చేశారు.

కాగా, వివాదాస్ప‌ద అయోధ్యలోని `రామ్ లాలా` విగ్రహానికి ఉన్ని దుస్తులు వేయాల‌ని - ఆలయంలో హీటర్లు పెట్టించాలని విజ్ఞ‌ప్తి చేస్తూ ఫైజాబాద్ క‌మిష‌న‌ర్ మ‌నోజ్ మిశ్రాకు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) అధికారికంగా ఓ పిటిష‌న్ ను దాఖ‌లు చేసింది. మ‌నుషుల మాదిరిగానే.....అన్ని దేవాల‌యాల్లో దేవుడికి ఆహారం అందిస్తున్నామ‌ని, దుస్తులు తొడుగుతున్నామ‌ని, ర‌క‌ర‌కాల సేవ‌లు చేస్తున్నామ‌ని....అదే మాదిరిగా వెచ్చ‌ద‌నం కూడా అందించాల‌ని `రామ్ లాలా` ప్ర‌ధాన అర్చ‌కుడు మ‌హంత్ స‌త్యేంద్ర అన్నారు. ఈ ర‌క‌మైన పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం. ఈ పిటిష‌న్ పై మ‌నోజ్ మిశ్రా మీడియాతో మాట్టాడారు. త‌న‌కు పిటిష‌న్ అందిన మాట వాస్త‌వ‌మేన‌ని, అయితే ఆ స్థ‌ల వివాదం కేసు సుప్రీమ్ కోర్టు ప‌రిధిలో ఉంద‌ని - అత్యున్న‌త న్యాయ‌స్థానం విధించిన నియ‌మ‌నిబంధ‌న‌లు, సూచ‌న‌ల ప్ర‌కారం త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు.