Begin typing your search above and press return to search.

కోలుకున్నా కోటిమంది మళ్ళీ కరోనా తో అవస్థలు పడ్డారట !

By:  Tupaki Desk   |   13 July 2021 4:58 AM GMT
కోలుకున్నా కోటిమంది మళ్ళీ కరోనా తో  అవస్థలు పడ్డారట !
X
కరోనా మహమ్మారి...భూ ప్రపంచంలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని మహమ్మారుల కంటే అత్యంత ప్రమాదకరమైనది. కరోనా కంటే ముందు ఎన్నో మహమ్మారులు మానవులపై దాడి చేసిన ఇంతటి బీభత్సం లేదు. అలాగే అప్పుడు వైద్యరంగం కూడా అంతగా అభివృద్ధి చెందలేదు. అయితే, ఇప్పుడు ప్రపంచం సైన్స్ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే ఆకాశాన్ని కూడా రాకెట్ లో వెళ్లి చూసి వస్తున్నారు. ఇంతగా అభివృద్ధి చెందిన ఈ సమయంలో కూడా కరోనా మహమ్మారి ఇంతటి అల్లకల్లోలం సృష్టించింది అంటే మాములు విషయం కాదు. కొన్ని కోట్లమంది కరోనా మహమ్మారి భారిన పడ్డారు. అలాగే మరెంతో మంది కరోనా కాటుకి బలైపోయారు.

అయితే, కరోనా మహమ్మారి భారిన పడి మృతి చెందిన వారు కొందరైతే , కరోనా నుండి కోలుకున్నాక కూడా అనేక ఆరోగ్య సమస్యలతో పోరాడే వారు మరికొందరు.కరోనా నుండి కోలుకున్న తర్వాత అవే లక్షణాలు ఎంతోమంది బాధితులను వెంటాడుతున్నాయి. వివిధ ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టి సతమతం అయ్యేలా చేస్తున్నాయి. కొందరికి వారాల తరబడి, ఇంకొందరికి నెలల పాటు ఈ తరహా సమస్యలు ఎదురు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా కొవిడ్‌ తదనంతర ఆరోగ్య సమస్యలపై కూలంకషమైన వివరాలను సేకరించే లక్ష్యంతో హైదరాబాద్‌ లోని ఏషియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆన్‌ లైన్‌ వేదికగా ఓ సర్వే నిర్వహించింది. 5,347 మందిని సర్వే చేయగా 2,391 మంది స్పందించారు.

సర్వే ఫలితాలు :

ఏషియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ చేసిన సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది తాము కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్‌ లక్షణాలు వెంటాడాయని చెప్పారట. ఈమేరకు వివరాలతో కూడిన సర్వే నివేదికను ఏఐజీ అధినేత డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి విడుదల చేశారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న చాలామంది రోగులకు ఇప్పటికీ ఇన్ఫెక్షన్‌ లక్షణాలు వెంటాడుతున్నట్లు సర్వే ద్వారా స్పష్టమైందని తెలిపారు.

ప్రధాన సమస్యలు :

కరోనా మహమ్మారి కి గురై కోలుకున్న తర్వాత కూడా తలెత్తిన ప్రధాన సమస్యల్లో బలహీనత, అలసట, ఒళ్లు నొప్పులు ఉన్నాయి. గుండెదడ, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, పొత్తి కడుపులో నొప్పి, ఛాతీనొప్పి, దగ్గు వంటివి కూడా పలువురికి ఎదురయ్యాయట. తీవ్రస్థాయి ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే నాడీ రుగ్మతలు, హృద్రోగ సమస్యలు, ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణకోశం, మూత్రాశయం, ఈఎన్‌టీ, కీళ్లకు సంబంధించిన ఇబ్బందులను కొందరు చవిచూసినట్లు సర్వేలో తెలిపారు. చికిత్స క్రమంలో అనుభవించిన మానసిక వ్యధ ప్రభావాన్ని, ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకున్న తర్వాత నిద్రలేమి, మానసిక సమస్యల రూపంలో చవిచూశామని ఇంకొందరు తెలిపారట.

సర్వేలో పాల్గొన్న 2,391 మందిలో 937 మందే కరోనా నుంచి కోలుకున్నాక ,ఆరోగ్య సమస్యలు తీవ్రమై ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చింది. 274 మంది అయిదు రోజుల పాటు, 511 మంది 5 నుంచి 10 రోజులు, 102 మంది 10 నుంచి 20 రోజులు, 50 మంది 20 రోజులకుపైగా ఆస్పత్రిలో చికిత్సపొందాల్సి వచ్చిందని సర్వే నివేదికలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నుండి కోలుకోవడానికి ఎంత సమయం పట్టింది, అని ప్రశ్నించగా స్పందించిన 447 మంది దాదాపు నెల రోజుల సమయం పట్టిందని తెలిపారు. 1 నుంచి 3 నెలల పాటు చికిత్స పొందామని 1139 మంది చెప్పగా, 3 నెలల కంటే ఎక్కువే సమయం పట్టిందని 805 మంది పేర్కొన్నారు. స్టెరాయిడ్స్‌ తీసుకున్న వారిలో 53 శాతం మంది, స్టెరాయిడ్స్‌ తీసుకోని 36.4 శాతం మంది కరోనా వైరస్ తదనంతర లక్షణాలను ఎదుర్కొనట్లు తెలిపారు. స్టెరాయిడ్స్‌ను వినియోగించిన వారిలో ఎక్కువ మంది కొవిడ్‌ తదనంతర సమస్యలను ఎదుర్కొన్నట్లు సర్వేలో వెలుగుచూసింది.

తీవ్రస్థాయి ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే నాడీ రుగ్మతలు, హృద్రోగ సమస్యలు, ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణకోశం, మూత్రాశయం, ఈఎన్‌టీ, కీళ్లకు సంబంధించిన ఇబ్బందులను కొందరు చవిచూసినట్లు సర్వేలో గుర్తించారు. పోస్ట్‌ కరోనా వైరస్ రుగ్మతల్లో 90 శాతం వరకు ఆస్పత్రిలో చేరకుండానే ఔట్‌ పేషంట్‌ (ఓపీ) విభాగంలో చికిత్సలతోనే నయం చేయొచ్చు. 10 శాతం మందికి మాత్రమే ఆస్పత్రి అడ్మిషన్‌ అవసరం అని ఏఐజీ అధినేత డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి తెలిపారు.