Begin typing your search above and press return to search.

కిడ్నాప్ కేసు: భార్గవ్ రామ్ తోపాటు అతడు కీరోల్

By:  Tupaki Desk   |   8 Jan 2021 11:31 AM GMT
కిడ్నాప్ కేసు: భార్గవ్ రామ్ తోపాటు అతడు కీరోల్
X
సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో హైదరాబాద్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. ఆమెను ఏ1గా పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఆమె భర్త భార్గవ్ రామ్ ను ఏ3గా గుర్తించారు. భార్గవ్ రామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

భూమా అఖిలప్రియ అరెస్ట్ అనంతరం విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. బోయినపల్లి కిడ్నాప్ ఉదంతంలో మరో నిందితుడు మాడాల శీను అలియాస్ గుంటూరు శ్రీను కూడా కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. గుంటూరు కు చెందిన మాడాల శ్రీను.. అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కు ప్రధాన అనుచరుడని నిర్ధారించినట్టు తెలుస్తోంది.

అఖిలప్రియ, భార్గవ్ రామ్ వేసిన కిడ్నాప్ ప్లాన్ ను మాడాల శ్రీను దగ్గరుండి అమలు చేశాడని అనుమానిస్తున్నారు. ఆరు నెలల కిందటే ఈ స్కెచ్ వేశారని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు. రెక్కీ నిర్వహించిన ప్రతిసారి సీసీటీవీల కంటపడకుండా ఉండడానికి ప్రతీ వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్లను అమర్చినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు ఇప్పుడు ఆరాతీస్తున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా కూడా అఖిలప్రియ తరుఫున అన్నీ తానై మాడాల శ్రీను వ్యవహరించాడని తెలుస్తోంది. ప్రచారం.. బ్రహ్మానందరెడ్డి షెడ్యుల్ ను సైతం శీనునే పర్యవేక్షించాడని చెబుతున్నారు. ఇప్పుడు అఖిలప్రియతో మాడాల శ్రీను వీడియో వైరల్ అవుతోంది.