Begin typing your search above and press return to search.

చేతిక ఎముక లేదంటూనే చేయిచ్చారు.. ఇప్పుడు చర్చలంటూ షాకిస్తారా?

By:  Tupaki Desk   |   28 Jan 2022 5:36 AM GMT
చేతిక ఎముక లేదంటూనే చేయిచ్చారు.. ఇప్పుడు చర్చలంటూ షాకిస్తారా?
X
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తూ.. కొత్త జీతాలు వద్దు బాబాయో.. పాత జీతాలు ఇస్తే చాలంటూ విచిత్రమైన డిమాండ్ ను చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త జీతాలు.. పాత జీతాల కంటే తక్కువగా ఉన్నాయని ఉద్యోగులు చెబుతూ.. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వటం తెలిసిందే. అయితే.. ఆ వాదనలో నిజం లేదని.. కొత్త పీఆర్సీ కారణంగా ప్రభుత్వ ఖజనాపై రూ.10వేల కోట్లకు పైనా భారం పడుతోందన్న మాట బలంగా వినిపిస్తోంది.

జీతాల విషయంలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి నష్టపోరని ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పష్టం చేస్తున్నారు. కొత్త పే స్లిప్ వచ్చిన తర్వాత వాస్తవాలు అర్థమవుతాయని ఆయన చెబుతున్నారు. పీఆర్సీపై అపోహలు తొలగించేందుకు ప్రభుత్వం నాలుగు మెట్లు దిగేందుకైనా సిద్దంగా ఉందన్నారు. సచివాలయంలో మంత్రుల కమిటీ వరుసగా మూడోరోజు సమావేశం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి.

పీఆర్సీ సాధన కమిటీ నుంచే కాకుండా మరే ఇతర సంఘం వారు వచ్చినా ప్రభుత్వం చర్చలు జరుపుతుందని చెప్పి.. త్వరలో ఏం జరుగుతుందన్న దానిపై ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెప్పారు. ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని తెలియజేయకుండా చర్చలకు షరతులు విధిస్తే ఎలా? అని ప్రశ్నించిన ఆయన.. చర్చలు కాకుండా మరే మార్గంలో సమస్యకు సాంత్వన లభిస్తుందో చెప్పాలన్నారు.

ప్రభుత్వం నియమించిన అధికార కమిటీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఆహ్వానించినా ఉద్యోగ సంఘాలు చర్చలకు రాకపోవటం దురదృష్టకరమన్నారు. మొండి వైఖరి విడిచిపెట్టాలని.. సెలవు రోజులు తప్పించి రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సచివాలయంలో మంత్రుల కమిటీ అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని వెల్లడించారు. కమిటీ స్థాయిలో సమస్యకు పరిష్కారం లభించకుంటే సీఎం వద్దకు విషయాన్ని తీసుకెళతామన్న ఆయన.. రెచ్చగొట్టే ధోరణితో వ్యతిరేకత పెంచుకోవద్దన్న సూచన చేశారు.

చర్చలకు వెళ్లమని ఉద్యోగ సంఘాల నాయకులకు సూచన చేయాలని కోరిన సజ్జల.. కొన్ని పత్రికలు వక్రభాష్యాలు చెబుతూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయన్నారు. సమ్మె తేదీ దగ్గర పడుతున్న వేళ.. సమ్మెపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒకవేళ సమ్మెకు వెళ్లాల్సి వచ్చినా అప్పుడైనా చర్చకు కూర్చోవాలి కదా? సీఎం సమక్షంలో ఫిట్ మెంట్ ప్రకటనలో పాల్గొని ఓకే చెప్పి.. ఆ తర్వాత పాత పీఆర్సీ కోరటం అంటే దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమ్మె చట్ట విరుద్ధమని.. కానీ తాము ఆ జోలికి వెళ్లట్లేదంటూ మెత్తగా చెబుతూనే ఇవ్వాల్సిన సంకేతాల్ని ఇవ్వటం గమనార్హం.

సజ్జల వ్యాఖ్యలపై ఉద్యోగుల స్పందన ఆసక్తికరంగా మారింది. తమ నేతల్ని పిలిచిన సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తన చేతికి ఎముక ఉండని అందరూ అంటుంటారని వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. తాము కోరుకున్నట్లుగా పీఆర్సీ ప్రకటన ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు భావించారు.

అందుకు భిన్నంగా ప్రకటన వెలువడటంతో వారు అవాక్కు అయ్యారు. తాజాగా సజ్జల మాటలు కూడా అదే తీరులో ఉన్నాయన్న మాటను ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. ఒకవైపు మెత్తగా మాట్లాడుతూనే.. ఆ మాటల వెనుక హెచ్చరిక ధ్వనించేలా ఉన్న వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకవైపు ఉద్యోగ సంఘాలన్ని ఉద్యోగుల డిమాండ్లపై గళం విప్పుతున్న వేళ.. సంఘాలకు సంబంధం లేని వారు తమతో చర్చ జరిపేందుకు ప్రభుత్వం వద్దకు వస్తే తాము స్వాగతిస్తామని చెప్పటం.. రాబోయే రోజుల్లో తామేం చేస్తామన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నారన్న మాట వినిపిస్తోందిన మరేం జరుగుతుందో చూడాలి.