Begin typing your search above and press return to search.

బ్యాంకులో వేసినా.. తీసినా జేబుకు చిల్లే బాస్

By:  Tupaki Desk   |   2 March 2017 7:49 AM GMT
బ్యాంకులో వేసినా.. తీసినా జేబుకు చిల్లే బాస్
X
కొత్త కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయి. బ్యాంకుల్లో డబ్బులు వేయటం.. అవసరానికి తీయటం లాంటివి కూడా జేబుకు చిల్లు పెట్టే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఆన్ లైన్ లావాదేవీల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కొత్త విధానాలకు తెర తీస్తున్నట్లు చెబుతున్నా.. తాజాగా బ్యాంకులు తీసుకున్న నిర్ణయాలు ఖాతాదారుల మీద అదనపు భారాన్ని పెంచటం ఖాయం. ప్రస్తుతానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ దిశగా నిర్ణయాలు తీసుకోనప్పటికీ.. ప్రముఖ ప్రైవేటు బ్యాంకులు తీసుకున్న తాజా నిర్ణయాలతో వినియోగదారులపై పెద్ద ఎత్తున ప్రభావం పడనుంది.

తాజాగా బ్యాంకులు తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో.. బ్యాంకులకు వెళ్లటం ఎంత వీలైతే అంత తక్కువగా వెళ్లాలన్న భావన కలిగేలా చేస్తాయనటంలో సందేహం లేదు. ఎందుకంటే.. బ్యాంకుల్లో నగదు వేసినా.. తీసినా.. ఏం చేసినా అదనపు భారం పడేలా.. చార్జీల వడ్డన కార్యక్రమానికి తెర తీశాయి కొన్ని ప్రైవేటు బ్యాంకులు. హెచ్ డీఎఫ్ సీ.. ఐసీఐసీఐ.. యాక్సిస్ తదితర బ్యాంకులు కొత్త తరహా ఛార్జీల వడ్డనకు తెర తీశాయి.

వినియోగదారులకు ఎన్ని రకాలుగా వడ్డన వేయాలో..అన్ని రకాలుగా వడ్డించే కార్యక్రమానికి తెర తీసిన వైనం చూస్తే.. బ్యాంకు లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించకపోయినా.. ముందస్తు ప్లానింగ్ లేకున్నా.. జేబుకు చిల్లు పక్కా అని చెప్పక తప్పదు. ఏ బ్యాంకుకు ఆ బ్యాంకు తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో.. బ్యాంకు లావాదేవీలు తరచూ జరిపే వారు.. బ్యాంకు అధికారుల్ని కలిసి.. మరింత సమాచారం తీసుకుంటే మంచిది లేదంటే.. పెద్దఎత్తున ఛార్జీల భారం మీద పడటం ఖాయం.

వివిధ బ్యాంకులు కొత్తగా విధిస్తున్న ఛార్జీల పోటు చూస్తే..

= హోం బ్రాంచిలో ఒక నెలలో తొలి నాలుగు క్యాష్ లావాదేవాలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత మాత్రం ప్రతి వెయ్యి రూపాయిలకు రూ.5 చొప్పునఛార్జీలు వసూలు చేస్తారు. కనీస రుసుము రూ.150గా వసూలు చేస్తారు.

= థర్డ్ పార్టీ నగదు లావాదేవీల పరిమితిని కొన్ని బ్యాంకులు రూ.25వేలుగా.. మరికొన్ని బ్యాంకులు రూ.50వేలుగా నిర్ణయించాయి. అంతకుమించితే అదనపు వడ్డనలు వడ్డిస్తారు.

= హోం బ్రాంచి కాని బ్రాంచిల్లో నెలలో తొలి క్యాష్ ట్రాన్ జాక్షన్ మాత్రమే ఉచితం. తర్వాతి వాటి నుంచి ఛార్జీల వడ్డన ఉంటుంది.

= క్యాష్ డిపాజిట్ చేసే మెషీన్లలో నెలలో తొలి డిపాజిట్ కు మాత్రమే ఉచితం. తర్వాత నుంచి వెయ్యికి రూ.5 చొప్పున వసూలు చేస్తారు.

= యాక్సిస్ బ్యాంకులో తొలి ఐదు ట్రాన్ జాక్షన్స్ .. లేదంటే రూ.10లక్షల క్యాష్ డిపాజిట్ లేదంటే విత్ డ్రాయిల్స్ కు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత మాత్రం అయితే వెయ్యికి రూ.5 లేదంటే రూ.150 ఏది ఎక్కువైతే.. ఆ మొత్తాన్ని ఛార్జీగా వసూలు చేస్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/