Begin typing your search above and press return to search.

పీసీసీలో భారీ మార్పులు.. ఉత్త‌మ్ సీటుకు ఎస‌రేనా?

By:  Tupaki Desk   |   28 Jan 2019 5:12 AM GMT
పీసీసీలో భారీ మార్పులు.. ఉత్త‌మ్ సీటుకు ఎస‌రేనా?
X
భారీ అంచ‌నాల‌తో బ‌రిలో దిగి... ఘోర ప‌రాజ‌యం చెందిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు ప్ర‌క్షాళ‌న ప‌ర్వంపై దృష్టి సారిస్తోంది. ఓ వైపు ఓట‌మి మ‌రోవైపు పాత కమిటీల‌కు నాలుగేళ్లు కావడంతో మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. పాత కొత్త నాయకులతో పాటు వచ్చే ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ ను సైతం సమాయత్తం చేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ...పార్లమెంటు ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని అధిష్టానం ఆదేశించినట్టు తెలిసింది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ కంటే ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

విశ్వ‌స‌నీయవ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం పార్టీ బలోపేతానికి అన్నిస్థాయిల్లోని క్యాడర్‌ ను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. పని చేయని వారిని తప్పించి, ఉత్సహవంతులైన నాయకులకు అవకాశం ఇచ్చి వారి సేవలను ఉపయోగించుకోవాలని అధిష్టానం ఆదేశించినట్టు పార్టీ నేతలు అంటున్నారు. అందులో భాగంగా తొలివేటు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ చార్జి రామచంద్రకుంతియా పై పడనుంది. ఇప్పటికిప్పుడు పీసీసీ పదవి తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో లోక్‌ సభ ఎన్నికలకు వరకు నామమాత్రంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కొనసాగించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. లోక్‌ సభ ఎన్నికల తర్వాత కొత్త పీసీసీ చీఫ్‌ ను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంలో భాగంగా రాష్ట్రస్థాయిలో ఐదు కమిటీలను నియమించనుంది. ఈ కమిటీలను రెండు,మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కోసం టీపీసీసీ ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, పబ్లిసీటి కమిటీ, ఎన్నికల కో ఆర్డినేషన్‌ కమిటీ, సమన్వయ కమిటీలను నియమించనుంది. కమిటీలకు సంబంధించిన పేర్లను ఇప్పటికే అధిష్టానానికి సమర్పించింది.

మ‌రో వైపు కీల‌క‌మైన గ్రామ-మండల-బ్లాక్‌-జిల్లా కమిటీలను ఒక్కొక్కటిగా నియమించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇదెలా ఉన్నా ఫిబ్రవరి మొదటివారంలో పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేసేందుకు అధిష్టానం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 31 జిల్లాలను ఏర్పాటు చేసింది. మరో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. మొత్తం 33 జిల్లాలకు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను నియమించే అవకాశం ఉంది. డీసీసీల జాబితాలను పార్టీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధిష్టానానికి సమర్పించారు. ఆ జాబితాను ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. దీంతోపాటు గ్రామ, బ్లాక్‌ కమిటీ ప్రక్రియను ఆ లోపు పూర్తి చేయాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పార్టీ పునాది చెదిరిపోవడంతో అధిష్టానం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీకి దూరమైన వర్గాలను దరికి తెచ్చుకోవాలనే ఏఐసీసీ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు చేయడంలేదనే అసంతృప్తి ఉన్నది. దీంతో పార్టీ అధ్యక్షుడికి పూర్తి బాధ్యతలు ఇవ్వకుండా కొత్త ఇన్‌ చార్జిని నియమించి...ఆ ఇద్దరికి లోక్‌ సభ ఎన్నికలను టార్గెట్‌ ఇవ్వాలని భావిస్తోంది.