Begin typing your search above and press return to search.

బీజేపీని పట్టించుకోని అన్నాడీఎంకే..!

By:  Tupaki Desk   |   31 Jan 2019 10:37 AM GMT
బీజేపీని పట్టించుకోని అన్నాడీఎంకే..!
X
దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో రాజకీయం నిత్యం ఆసక్తికరంగా ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఎవరితో పొత్తులో ఉండేది చెప్పలేం. క్షణాల్లో పొత్తులు మారుతుంటాయి. అయితే కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో రెండు పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తున్నాయి. జాతీయ పార్టీలకు ఇక్కడి ప్రజలు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీంతో డైరెక్టుగా కాకుండా స్థానిక పార్టీలతో కలిసివెళ్లడం జాతీయ పార్టీలకు ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా డీఎంకేతో కాంగ్రెస్‌, అన్నా డీఎంకేతో బీజేపీ ప్రస్తుతానికి పొత్తుతో ముందుకుసాగుతున్నాయి..

అన్నాడీఎంకే అధికారంలో ఉండగానే జయలలిత మృతి చెందడంతో ఆ పార్టీ రెండు ముక్కలుగా చీలింది. దీంతో పళనిస్వామి వర్గానికి బీజేపీ అండదండలతో ప్రస్తుతం అధికారంలో కొనసాగుతోంది. అయితే వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో మాత్రం సీన్‌ మారనుంది. ఆ ఎన్నికల్లో అన్నా డీఎంకే-బీజేపీ పొత్తు ఉంటుందో..? లేదో..? నని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఎందుకంటే ఇప్పటికే అన్నాడీఎంకే అన్ని నియోజవర్గాలోని తమ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది.

దీంతో స్థానిక బీజేపీ నాయకులు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్రంలో బీజేపీతో కలిసి వెళితే కొన్ని సీట్లు కూడా రావని అన్నాడీఎంకే భావిస్తోంది. దీంతో ఒంటరిగానే రంగంలోకి దిగనుంది. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పుడే స్పందించడం లేదు. ఎన్నికలు దగ్గర పడితే అప్పుడు కలిసి ఉండాలా..? విడిపోవాలా..? అనేదానిపై ఆలోచిస్తారట.

మరోవైపు డీఎంకే కాంగ్రెస్‌ తో కలిసి లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఇతర మిత్ర పక్షాలతో ఈసారి క్లీన్‌ స్వీప్‌ చేసే విధంగా ప్లాన్‌ వేస్తోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తరువాత ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్న పార్టీ డీఎంకే కావాలని స్టాలిన్‌ వ్యూహ రచన చేస్తున్నారు. అయితే అన్నాడీఎం మాత్రం బీజేపీ దోస్తీపై మీనమేషాలు లెక్కిస్తోంది. మరి అన్నాడీఎంకే తాత్సారంపై బీజేపీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.