Begin typing your search above and press return to search.

హర్షకుమార్ కొడుకు ఉలికిపాటు

By:  Tupaki Desk   |   23 July 2015 10:56 AM GMT
హర్షకుమార్ కొడుకు ఉలికిపాటు
X
గోదావరి పుష్కరాల తొలిరోజున రాజమండ్రి కోటిలింగాల రేవు వద్ద తొక్కిసలాట ఘటన పైన తాను హైకోర్టుకు వెళ్తానని మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ చెప్పారు. అధికారులు, పోలీసుల వైఫల్యం వల్లే రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగిందని ఆరోపించిన ఆయన ఈ ఘటనలో అనవసరంగా తన తండ్రిపై నిందలు మోపుతున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, దర్శకులు బోయపాటి శ్రీను ల పైన కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తొక్కిసలాటకు హర్షకుమార్ కారణమని ఏపీ మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందన్న వార్తల నేపథ్యంలో శ్రీరాజ్ దీనిపై కోర్టుకు వెళ్తానంటున్నారు.

రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. ఏపీ మంత్రులంతా రాజమండ్రిలో తొక్కిసలాట హర్షకుమార్ వర్గం కుట్రేనని ఆరోపించారట. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విచారణలో ఏ సంగతీ తేలుతుందని అన్నట్లు సమాచారం. తొలుత మంత్రి అచ్చెన్నాయుడు ఇందులో కుట్ర ఉన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. హర్షకుమార్ రాజమండ్రి లో చేపట్టిన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిందని, తమ డిమాండ్లను పరిష్కరించకుండా ఎలా పుష్కరాలు చేస్తారో చూస్తామని ఆయన హెచ్చరించారని అన్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మరో మంత్రి పీతల సుజాత కూడా అచ్చెన్నాయుడు అనుమానాన్ని బలపరిచారు. కాగా చంద్రబాబు కూడా.... నేరుగా ఏమీ అననప్పటికీ తాను స్నానం ముగించి వస్తుండగా, విద్యుత్ తీగలు తెగాయని ప్రచారం జరుగుతోందని అధికారులు చెప్పారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని తాను తెలిపి వెళ్లిపోయానని మంత్రివర్గంలో చెప్పారు. మొత్తానికి మంత్రివర్గంలో దీనిపై జరిగిన చర్యలో కుట్రకోణంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. వేళ్లన్నీ హర్షకుమార్ వైపే చూపించాయి. ఆ నేపథ్యంలో హర్షకుమార్ తనయుడు ఇప్పుడు దీనిపై కేసేసేందుకు సిద్ధమవుతున్నారు.

కాగా సంఘటన జరిగిన రోజునే ప్రత్యక్ష సాక్షి ఒకరు ఇలా విద్యుత్ తీగలు తెగాయన్న వదంతులు వచ్చాయని చెప్పిన విషయంలో సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చింది. అయితే... అంతా చంద్రబాబుదే తప్పన్నట్లుగా ప్రచారం చేయడంతో దాన్నెవరూ సీరియస్ గా తీసుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో... మంత్రుల అనుమానాల నేపథ్యంలో కుట్ర కోణం ఉండొచ్చన్న అనుమానాలు అందరిలోనూ బలపడుతున్నాయి.

మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్షకుమార్ తరఫున ఆయన కుమారుడు కేసేసేందుకు రెడీ అవుతున్నారు. సెంట్రల్ జైలులో ఉండి కనీసం ఫోన్ కూడా లేని మాట్లాడలేని స్థితిలో ఉన్న తన తండ్రిపై అబాండాలు సరికాదన్నారు. కాగా పుష్కరాలు ఎలా జరుపుతారో చూస్తానంటూ సవాల్ చేసిన హర్షకుమార్ కుట్ర వల్లే తొక్కిసలాట జరిగిందని శ్రీరామ్ సేన రాష్ట్ర అధ్యక్షులు బండారు రమేష్ కూడా ఆరోపిస్తున్నారు. హర్షకుమార్ దీక్షను భగ్నం చేశారన్న కక్షతో కరెంటు వైర్లు తెగిపడ్డాయని పుకార్లు సృష్టించారని ఆరోపించారు. రాజమండ్రిలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాద ఘటన పైన సైతం తనకు అనుమానాలున్నాయని చెప్పారు.