Begin typing your search above and press return to search.

గొడ్డు మాంసం తినటం తప్పన్న కాంగ్రెస్ సీఎం

By:  Tupaki Desk   |   20 Nov 2015 9:19 AM GMT
గొడ్డు మాంసం తినటం తప్పన్న కాంగ్రెస్ సీఎం
X
గోవధ.. గొడ్డు మాంసంపై కాంగ్రెస్ తాజాగా ఇరుకున పడింది. ఇప్పటివరకూ తాను చెప్పిన మాటలకు పూర్తి భిన్నమైన మాటల్ని చెప్పిన ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ పార్టీకి భారీ షాక్ నే ఇచ్చారు. గోవధ.. గొడ్డుమాంసం లాంటి అంశాల మీద గత కొద్ది రోజులుగా ఎంత రచ్చ జరగాలో అంత రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. గోవధ వ్యవహారం.. దేశంలో మత అసహనం లేకుండా చేస్తుందని.. ఇదంతా బీజేపీ నేతల ఫుణ్యమేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా.. ఆ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపటంతో పాటు.. వివాదాస్పదంగా మారాయి.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ మాట్లాడుతూ.. గోవధ చేసే వారికి భారత్ లో నివసించే హక్కు లేదంటూ మాటల మంటలు పుట్టించారు. ఇలాంటి మాటలు బీజేపీ ముఖ్యమంత్రి చేయటం మామూలే. కానీ.. అందుకు భిన్నంగా ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి నోటి వెంట నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావటం కలకలాన్ని రేపుతోంది. గోవధపై ఆయన మాట్లాడుతూ.. గోవుల్ని ఏ మతానికి చెందిన వారు చంపినా వారు దేశానికి అతి పెద్ద శత్రువుగా అభివర్ణించారు. ‘‘అలాంటి వారికి దేశంలో నివసించే హక్కు లేదు’’ అనటం ఇప్పుడు వివాదాస్పంగా మారింది. అంతేకాదు.. దేశంలోని ముస్లింలు బీఫ్ తినేయటం మానేయాలని ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం.

దేశంలో.. మత సహనం రోజురోజుకి తగ్గిపోతుందని.. దీనికి బీజేపీ నేతల వైఖరే కారణమని విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మత అసహనం మీద ఇంతకాలం కేంద్రం మీద దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు తమ పార్టీకి చెందిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో..?