Begin typing your search above and press return to search.

పటేళ్ల ఎత్తుగడ అదుర్స్..

By:  Tupaki Desk   |   8 Sep 2015 7:30 AM GMT
పటేళ్ల ఎత్తుగడ అదుర్స్..
X
భారత స్వాతంత్ర్యోద్యమంలో గుజరాత్ పాత్ర ఎలాంటిదో తెలిసిందే కదా... అక్కడ పుట్టిన గాంధీ మహాత్ముడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఆయన చేపట్టిన ఉద్యమాలను మాత్రం మరోసారి గుర్తుచేసుకుందాం. గాంధీజీ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడినా అంతా అహింసా మార్గంలో సాగింది. అహింసా పోరాటమన్నది ప్రపంచానికి తెలియడం అదే తొలిసారి. అలాగే సత్యాగ్రహం, పాదయాత్రలు వంటివీ గాంధీ తెచ్చిన నిరసన విధానాలే. అయితే... గాంధీ పుట్టిన నేలలో మరో కొత్త నిరసన విధానం రాబోతుంది... అయితే.. గాంధీలా ఎవరికీ ఇబ్బంది పెట్టని విధానం కాదు.. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను కూడా ఇబ్బందిపెట్టగల స్థాయి నిరసన విధానమది. ఆర్థిక నిల్వలు అడుగంటేలా చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం... గుజరాత్ ను ఆర్థికంగా అతలాకుతలం చేయడం లక్ష్యంగా చేస్తున్న నిరసన అది...

గుజరాత్ లో పటేళ్ల లొల్లి భారీస్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే... ఆందోళనలు.. ఉద్యమాలతో పటేళ్లు దేశం దృష్టిని ఆకర్సించారు. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు గాను వారు వేసిన ఇంకో ఎత్తుగడ దేశం దృష్టిని మరోసారి ఆకర్షిస్తోంది. అది బ్యాంకుల్లోని తమ డిపాజిట్లను వెనక్కు తీసుకోవడం. ఇది మామూలు విషయంలాగే కనిపిస్తున్నా దీని ప్రభావం భారీగా ఉండనుంది. ఎందుకంటే గుజరాత్ లో పటేల్లు సంపన్నవర్గాలు. బ్యాంకుల్లో భారీగా డిపాజిట్లు ఉంటాయి వారికి. గుజరాత్ లో కోటీ నలభై లక్షల మంది పటేళ్లు ఉండగా వారికి 70 లక్షల బ్యాంకు ఖాతాలున్నాయట. వాటిలో వేల కోట్ల రూపాయలున్నాయి. ఇప్పుడు ప్రతి పాటేదార్ తమ డిపాజిట్లలోనుంచి రూ.50 వేలు అంతకంటే ఎక్కువ మొత్తం విత్ డ్రా చేయాలని పిలుపునిచ్చారు ఆ సంఘం నేతలు. అంటే... వేలకోట్లు బ్యాంకుల నుంచి ఖాళీ కానున్నాయన్నమాట.

ఇంతవరకు దేశంలో ఇలాంటిది ఎప్పుడూ లేకపోవడంతో ఇది వారు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఎలాంటి ప్రభావం పడుతుందన్నది చూడాలి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పటేళ్ల తరఫున ఎన్నికల్లో అభ్యర్థులనూ నిలపనున్నారు.