Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఎన్నికల ఖర్చుకు స్పాన్సర్ ‘నయీం’

By:  Tupaki Desk   |   7 Oct 2018 5:45 AM GMT
కేసీఆర్ ఎన్నికల ఖర్చుకు స్పాన్సర్ ‘నయీం’
X
నయీం చచ్చి ఎక్కడున్నాడో కానీ కేసీఆర్‌ కు మాత్రం వేల కోట్ల సంపదనిచ్చిపోయాడట. ఇదెవరో ఆషామాషీ నేతలు చేస్తున్న విమర్శ కాదు... కాంగ్రెస్ సీనియర్ నేత - తెలంగాణ స్ట్రాటజీ కమిటీ ఛైర్మన్ వి.హన్మంతరావు చేసిన ఆరోపణ. అవును....కేసిఆర్ నయీం డబ్బు మొత్తం మడతపెట్టేశారని ఆయన ఆరోపించారు. గుట్టలుగుట్టలుగా ఉన్న ఆ డబ్బు లెక్క పెట్టేందుకు బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా మిషన్లు తెప్పించారని కూడా ఆయన ఆరోపించారు. నయీం వద్ద ఉన్న బంగారం కూడా కేసిఆర్ తినేశారని... ఆ డబ్బంతా కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు పెట్టబోతున్నాడని ఆరోపించారు.

కాంగ్రెస్ స్ట్రాటజిక్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన కేసీఆర్‌ పై మండిపడ్డారు. ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ ఏం చేయాలో కూడా ఆయన సూచించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక ఇంటికి ఒకే సీటు అన్న ఫార్ములా కచ్చితంగా అమలు చేసి తీరాలని తాము ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో ప్రతి పార్లమెంటు సీటు పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు బిసిలకు కేటాయించాలని సూచన చేస్తున్నట్లు చెప్పారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలని తాను గట్టిగా కోరుతున్నట్లు చెప్పారు.

కేసిఆర్ మీద తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న వీహెచ్.. ఇందుకోసం నేతలు డబ్బులు జేబులోంచి బయటకు తీయాలన్నారు. కాంగ్రెస్ ను పవర్ లోకి తెచ్చేందుకు గతంలో మంత్రులుగా పనిచేసిన వారు నాలుగు పైసలు ఖర్చు చేస్తే తప్పేం లేదన్నారు.