Begin typing your search above and press return to search.

ఏపీలో గ్రేట్ ఫైట్ గ్రీన్ సిగ్న‌ల్‌!

By:  Tupaki Desk   |   2 Sep 2016 4:27 AM GMT
ఏపీలో గ్రేట్ ఫైట్ గ్రీన్ సిగ్న‌ల్‌!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని రాజ‌కీయ పార్టీల‌కు అస‌లు ప‌రీక్ష సిద్ధం అవుతోంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణ‌యం - పుర‌పాల‌క శాఖ వేగ‌వంత‌మైన నిర్ణ‌యాల‌తో మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల ముహూర్తం సమీపిస్తుండ‌టం ఇందుకు తార్కాణంగా చెప్తున్నారు. అవరోధంగా ఉన్న కోర్టు కేసులను పరిష్కరించి సాధ్యమైనంత వేగంగా వార్డుల పునర్విభజన కోసం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక - పట్టణాభివృద్దిశాఖ మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. నగరపాలక - పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణ కోసం సన్నద్ధం కావాలని అధికారులకు పరోక్షంగా సూచనలు చేసిన ఉన్నతాధికారులు త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. దీంతో సార్వ‌త్రిక‌ ఎన్నిక‌లు జ‌రిగిన రెండున్న‌రేళ్ల త‌ర్వాత రానున్న మొట్ట‌మొద‌టి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీల అస‌లు స‌త్తా తేల‌నుంద‌ని అంటున్నారు.

జీవీఎంసీకి ఈ అక్టోబరులో ఎన్నికలు నిర్వహించాలని మొదట ప్రభుత్వం భావించింది. ప్రజాసాధికార సర్వే కారణంగా అది వాయిదా పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పురపాలక - పట్టణాభివృద్ధిశాఖ పనితీరుపై ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇప్పటికీ ఎన్నికలకు నోచుకోని నగరపాలక - పురపాలక సంఘాల అంశం ప్రస్తావనకు వచ్చింది. డిసెంబరులో - లేదంటే వచ్చే మార్చిలోగా ఎన్నికల నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆయన సంబంధిత మంత్రి నారాయణ - ముఖ్య కార్యదర్శిని తెలుస్తోంది. వివిధ చోట్ల ఎన్నికలకు అడ్డంకిగా ఉన్న కోర్టు కేసుల పరిష్కారంపైనా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో జీవీఎంసీలో భీమునిపట్నం మండలంలోని ఐదు విలీన పంచాయతీలపై హైకోర్టులో ఉన్న కేసులు మరోసారి తెరపైకి వచ్చాయి. అనకాపల్లి - భీమునిపట్నం పురపాలక సంఘాలతోపాటు ఆ రెండు మండలాల్లో పది పంచాయతీల విలీనాన్ని సవాల్‌ చేస్తూ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వేసిన కేసు కూడా ఇప్పటికీ హైకోర్టులో పెండింగులో ఉంది. ముఖ్యమంత్రి జోక్యంతో వెలగపూడి వేసిన కేసును వెనక్కి తీసుకునే అవకాశాలున్నాయి. భీమునిపట్నం మండలంలోని ఐదు పంచాయతీల విలీనానికి వ్యతిరేకంగా నమోదైన కేసుల పరిష్కార బాధ్యతను మంత్రి గంటా శ్రీనివాసరావుకు అప్పగించే అవకాశం ఉంది. ఒక వైపున కేసులను పరిష్కరిస్తూనే, ఇంకో వైపున వార్డుల పునర్విభజన కోసం కసరత్తు ప్రారంభించాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ నుంచి నాలుగైదు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని స‌మాచారం.

అనకాపల్లి - భీమునిపట్నం పురపాలక సంఘాలతోపాటు ఆ రెండు మండలాల్లో మరో పది పంచాయతీల విలీనంతో జీవీఎంసీ విస్తీర్ణం 533 చదరపు కిలోమీటర్ల నుంచి 593 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ఈ నేపథ్యంలో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొత్త ప్రాంతాల విలీనానికి ముందు జీవీఎంసీలో 72 వార్డులు ఉండేవి. 2001 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 20 వేలమందికో వార్డు చొప్పున ఉండేవి. 2011 జనాభా లెక్కల ప్రకారం మరోసారి వార్డుల పునర్విభజన చేస్తే వీటి సంఖ్య 82కి పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాల అంచనా. అంటే అదనంగా మరో 10 వార్డులు రానున్నాయి. ఒకవేళ వార్డుల్లో జనాభా 20 వేలకంటే ఇంకా తక్కువగా చూపించి పునర్విభజన చేస్తే వార్డుల సంఖ్య 90 వరకు పెరగొచ్చని భావిస్తున్నారు.మొత్తంగా ఈ నెల‌లోనే ఏపీలో గ్రేట‌ర్ ఫైట్‌ కు గ్రీన్ సిగ్న‌ల్ రానుంద‌ని ఖాయంగా క‌నిపిస్తోంది.