Begin typing your search above and press return to search.

జీవీఎల్ సైటైర్లు...బాబు ఆవేద‌న‌

By:  Tupaki Desk   |   15 Sep 2018 7:01 AM GMT
జీవీఎల్ సైటైర్లు...బాబు ఆవేద‌న‌
X
`నేనేం నేరం చేశాను? నేను ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. నేరాలు, ఘోరాలు అంతకన్నా చేయలేదు. ఏది చేసినా ప్రజాహితం కోసం చేశామే తప్ప ఎటువంటి స్వార్థంతో ప‌నిచేయ‌లేదు. ప్రజలు నాకు అండగా ఉండాలి`` ఇది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆవేద‌న కం పిలుపు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు వారెంట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరో 14 మందికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. చంద్రబాబును కోర్టులో హాజరు పర్చాలంటూ ఆదేశాలు జారీచేసింది. దీనిపైనే సీఎం చంద్ర‌బాబు స్పందిస్తూ పై విధంగా ఆవేద‌న చెందారు.

ఈ నెల 21లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన‌డంపై టీడీపీ నేత‌లు స‌హ‌జంగానే మీడియా ముందు విరుచుకుప‌డ్డారు. కేంద్రం కుట్ర‌, బీజేపీ ఎత్తుగ‌డ‌, ఉద్దేశ‌పూర్వ‌క క‌క్ష వంటి ఆరోప‌ణ‌ల‌న్నీ చేసేశారు. అయితే, దీనిపై బీజేపీ నేత‌లు సైతం త‌గు విధంగానే స్పందించారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు - బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ఓ రేంజ్‌ లో విరుచుకుప‌డ్డారు. ప్రజల్లో సానుభూతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బాబ్లీ ఆందోళనకు సంబంధించి మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే దాన్నీ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

ఢిల్లీలోని తన నివాసంలో జీవీఎల్ విలేక‌రులతో మాట్లాడుతూ 2010లో రాజకీయ ప్రయోజనం కోసం ఓ పోరాటం పేరుతో అప్పట్లో డ్రామాలు ఆడారని దుయ్యబట్టారు. ఇలాంటి డ్రామా రాజకీయాలు చేయడం చంద్రబాబుకి కొత్తేమీ కాదని ఆయన తెలిపారు. పోలీసులపై బాబు, ఆయన పార్టీ నేతలపై దురుసుగా ప్రవర్తించారని గుర్తుచేశారు. బాబ్లీ ఆందోళనకు ఎన్‌బీడబ్ల్యూ వస్తే దాన్ని ఆసరా చేసుకుని సానుభూతి పొందాలని టీడీపీ ప్రయత్నిస్తోందని జీవీఎల్ ఆరోపించారు. కోర్టుల నుంచి నోటీసులు వచ్చినంత మాత్రాన వాటిని చూసి భయపడే రకం చంద్రబాబు కాదని ఆయన పేర్కొన్నారు. వారెంట్‌నూ పబ్లిసిటీ కోసం ప్రయాత్నిస్తారని బాబుపై విరుచుకుపడ్డారు. ఈ వివాదంలో కోర్టు 22 నోటీసులు ఇచ్చిందని, ఎంతకూ స్పందనలేకపోవడంతో కోర్టు నుంచి ఎన్‌బీడబ్ల్యూ వచ్చిందని నరసింహరావు ధ్వజమెత్తారు. వారం ముందు నుంచే నోటీసులు వస్తాయని ప్రచారం చేసుకున్నారని, టీడీపీ ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో కూడా పెద్దగా పురోగతి ఇప్పటికి లేదని, ఎందుకు పురోగతి లేదో ప్రజలకు తెలుసని ఆయ‌న వ్యాఖ్యానించారు. పీడీ ఖాతాలపై సీబీఐ విచారణ జరపాలని కోరామని ఇప్పటి వరకూ టీడీపీ ప్రభుత్వం ముందుకు రాలేదని వెల్లడించారు. సినీన‌టుడు శివాజీ తెలుగుదేశం పార్టీ కోసం ‘ఆపరేషన్ ప్యాకేజీ’తో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.