Begin typing your search above and press return to search.

ఐటీ దాడులంటే భ‌య‌మెందుకు బాబూ?:జీవీఎల్

By:  Tupaki Desk   |   5 Oct 2018 3:11 PM GMT
ఐటీ దాడులంటే భ‌య‌మెందుకు బాబూ?:జీవీఎల్
X
ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడిపై బీజేపీ నేత జీవిఎల్‌ నరసింహారావు అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా తీవ్ర స్థాయిలో మండిప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్ల చంద్ర‌బాబు అవినీతి పాల‌న‌ను జీవీఎల్ ప‌లుమార్లు తూర్పారబ‌ట్టారు. ఐక్యరాజ్యసమితిలో చంద్ర‌బాబు ప్ర‌సంగం ఆహ్వానాన్ని మీడియా ముందు బ‌య‌ట‌పెట్టాల‌ని జీవీఎల్ డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, ఏపీలో కొంత‌మందిపై ఐటీ దాడులు చేసిన నేప‌థ్యంలో మ‌రోసారి చంద్ర‌బాబుపై జీవీఎల్ విరుచుకుప‌డ్డారు. రాష్ట్రానికి చేసిన అప్పుల డ‌బ్బుల‌ నుంచి కూడా స్కాం చేసిన ఘనత చంద్రబాబుదేన‌ని జీవీఎల్ మండిప‌డ్డారు. ఐటీ దాడులను కూడా త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోగ‌లిగిన ఏకైక వ్య‌క్తి చంద్ర‌బాబేన‌ని ఎద్దేవా చేశారు. గ‌త నాలుగేళ్ల‌లో ఏపీలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, కానీ, అవినీతిపై దాడులు జరిగితే రాష్ట్రం అప్రతిష్ట పాలవుతుందని చంద్ర‌బాబు అన‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు.

తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని, ఒక‌వేళ చంద్ర‌బాబు త‌ప్పు చేయ‌కుంటే త‌న ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల‌నుకుంటోన్న టీడీపీపై జీవీఎల్ సెటైర్లు వేశారు. త‌మ‌ ఉనికి కాపాడుకోవ‌డానికి దేశంల‌ని చిన్నా చితకా పార్టీలను కాంగ్రెస్ కలుపుకుని పోతోంద‌ని అన్నారు. 2014లో తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామ‌ని, ఈ సారి ఎన్నిక‌ల్లో త‌మ‌కు పట్టుకున్న శని(టీడీపీ) వదిలింద‌ని అన్నారు. 2019 ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ కు ఆ శ‌ని తగులుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, టీడీపీ రెండూ అవినీతి పార్టీలేన‌ని, రాహుల్‌ గాంధీలో లోకేష్ ను చంద్ర‌బాబు చూసుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. టీడీపీ అవినీతిలో కూరుకుపోయింద‌ని, సైకిల్ కి తుప్పు పట్టిందని సెటైర్ వేశారు. ఓటుకు నోటు కేసుకు భ‌య‌ప‌డే హైదరాబాద్‌ నుంచి అమరావతికి బాబు పారిపోయార‌ని ఎద్దేవా చేశారు.