Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ ఆర్టీసీ బ‌స్సులో తుపాకీ కాల్పులు

By:  Tupaki Desk   |   2 May 2019 8:35 AM GMT
హైద‌రాబాద్‌ ఆర్టీసీ బ‌స్సులో తుపాకీ కాల్పులు
X
విన్నంత‌నే మ‌తి పోయే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైద‌రాబాద్ ఆర్టీసీ బ‌స్సులో చోటు చేసుకున్న ఈ ఇష్యూ ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారింది. చిన్న వాదులాట తుపాకీ కాల్పుల వ‌ర‌కూ వెళ్లింది. సంచ‌ల‌నంగా మారిన ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే..

సికింద్రాబాద్ నుంచి ఫిలింన‌గ‌ర్ కు వెళుతున్న 47ఎల్ బ‌స్సు పంజాగుట్ట శ్మ‌శాన వాటిక వ‌ద్ద చేరుకున్న స‌మ‌యంలో ఒక వ్య‌క్తి తోటి ప్ర‌యాణికుడితో వాదులాట చోటు చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌యాణికుడు ఒక‌రు బ‌స్సు దిగాల‌నటం.. దాంతో కోపానికి గురైన స‌ద‌రు వ్య‌క్తి జేబులో నుంచి తుపాకీ తీసి కాల్పులు జ‌రిప‌న‌ట్లుగా తెలుస్తోంది.

ఊహించ‌ని ఈ ప‌రిణామానికి విస్తుపోయిన బ‌స్సులోని వారు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఇదిలా ఉంటే.. తుపాకీ కాల్పులు జ‌రిపిన వ్య‌క్తి స‌ఫారిలో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. కాల్పులు జ‌రిపిన వెంట‌నే బ‌స్సు దిగి వెళ్లిపోగా.. అత‌డ్ని ఎవ‌రూ ప‌ట్టుకోలేదు.

ఇదిలా ఉంటే.. బ‌స్సులో ఇంత జ‌రుగుతున్నా.. డ్రైవ‌ర్ బ‌స్సును ఆప‌లేద‌ని తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు బ‌స్సుతో పాటు కాల్పులు జ‌రిపిన వ్య‌క్తి కోసం గాలిస్తున్నారు. కాల్పులు జ‌రిపిన బ‌స్సు కంటోన్మెంట్ డిపోకు తీసుకెళ్లారు. కాల్పులు జ‌రిపింది ఎవ‌రు? ఆ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింది? కాల్పులు జ‌రిపిన వ్య‌క్తి వ‌ద్ద‌కు తుపాకీ ఎలా వ‌చ్చింది? లాంటి అంశాల‌కు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.