Begin typing your search above and press return to search.

నయీం ఎన్ కౌంటర్ తో గుజరాత్ పోలీసులు హ్యాపీ

By:  Tupaki Desk   |   14 Aug 2016 12:25 PM GMT
నయీం ఎన్ కౌంటర్ తో గుజరాత్  పోలీసులు హ్యాపీ
X
గ్యాంగ్ స్టర్ నయీం మరణం తరువాత ఆయనతో సంబంధాలున్న పోలీసులు - నేతలు అంతా హడలిపోతున్నరు. ముఖ్యంగా తెలంగాణలోని చాలామంది పోలీసులకు ఆయనతో సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వారంతా టెన్షన్ పడుతున్నారు. కానీ... గుజరాత్ పోలీసులు మాత్రం నయీం మరణంతో ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. న‌యీం చ‌నిపోయి గుజ‌రాత్ పోలీసుల నెత్తిన పాలుపోశాడు. ఎలాగంటారా? సోహ్ర‌బుద్దీన్ ఎన్‌ కౌంట‌ర్ కేసులో సీబీఐ న‌యీముద్దీన్ కోసం సీబీఐ చాలాకాలంగా గాలిస్తోంది. సోహ్రబుద్దీన్ ది నకిలీ ఎన్ కౌంటరంటూ గుజరాత్ పోలీసులపై అభియోగాలున్నాయి. ఆ కేసులో ఒకే ఒక్క కీలక సాక్షిగా పేర్కొంటున్న నయీం మరణంతో కేసు కాస్త క్లోజ్ చేసే పరిస్థితి రావడంతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.

సోహ్ర‌బుద్దీన్‌ ను గుజరాత్ పోలీసులు 2005లో ఎన్‌ కౌంట‌ర్ చేశారు. ఈ ఎన్‌ కౌంట‌ర్ బూట‌క‌మన్న ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. దీనిపై కేసు న‌మోదైంది. కేసు సీబీఐకి బ‌దిలీ అయింది. వారి విచార‌ణ‌లో సోహ్ర‌బుద్దీన్ ఎన్‌ కౌంట‌ర్‌ లో న‌యీం కూడా కీల‌క సాక్షే అని తేల్చింది. ఎన్‌ కౌంట‌ర్‌ కు న‌యీంకు ఉన్న సంబంధం ఏంటి? అనుకుంటున్నారా. సోహ్ర‌బుద్దీన్ ఎన్‌ కౌంట‌ర్ బూట‌క‌మ‌ని వార్త‌లువ‌చ్చిన‌ట్లే.. అత‌ని స‌మాచారం గుజ‌రాత్ పోలీసుల‌కు ఇచ్చింది న‌యీమేన‌న్న ప్ర‌చారం కూడా ఉంది. అందుకే సీబీఐ అత‌ని కోసం తీవ్రంగా గాలించింది.

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈకేసులో గుజరాత్ కు చెందిన ఇద్ద‌రు ఐపీఎస్‌ లు - ఏడుగురు పోలీసు ఇన్‌ స్పెక్ట‌ర్లు నిందితులుగా ఉన్నారు. సోహ్ర‌బుద్దీన్ ఎన్‌ కౌంట‌ర్‌ కు సంబంధించిన కీల‌క సాక్షి న‌యీం ఇటీవ‌ల మ‌ర‌ణించడంతో గుజరాత్ పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్న‌ట్లు తెలిసింది. ఆ ఎన్‌ కౌంట‌ర్‌ కు సంబంధించిన ఒకే ఒక్క సాక్షి కూడా పోలీసుల చేతిలో హ‌త‌మ‌వ‌డంతో ఇంక సోహ్ర‌బుద్దీన్ కేసు క్లోజవ్వాల్సిందేనని గుజరాత్ పోలీసులు సంబరపడుతున్నారట.