Begin typing your search above and press return to search.

షాకింగ్ గా మారిన గుజ‌రాత్ గ్రౌండ్ రిపోర్ట్‌!

By:  Tupaki Desk   |   6 Dec 2017 5:52 AM GMT
షాకింగ్ గా మారిన గుజ‌రాత్ గ్రౌండ్ రిపోర్ట్‌!
X
అక్క‌డెక్క‌డో ఉన్న గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో తెలుగోళ్ల‌కు ఉన్న లింకేమిట‌న్న ప్ర‌శ్న వేసుకుంటే పప్పులో కాలేసిన‌ట్లే. రాజ‌కీయాల మీద అవ‌గాహ‌న ఉన్న వారంతా ఇప్పుడెంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఎన్నిక‌ల ఫ‌లితం గుజ‌రాత్‌. ప్ర‌ధాని మోడీ ఇలాకాలో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌లు మోడీ ఫ్యూచ‌ర్ ను డిసైడ్ చేయ‌నుండ‌ట‌మే కాదు.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఎలాంటి మూడ్ లో జ‌ర‌గ‌నున్నాయ‌న్న విష‌యాన్ని తేల్చ‌నున్నాయి.

రెండు ద‌శాబ్దాలుగా గుజ‌రాత్‌ లో తిరుగులేని రీతిలో దూసుకెళుతున్న బీజేపీకి ఈసారి జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌లు పెను స‌వాళ్ల‌నే విసురుతున్న‌ట్లుగా చెబుతున్నారు. చివ‌ర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా లాంటోడు సైతం ఒక ఇంగ్లిషు మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో.. గుజ‌రాత్ లోని బీజేపీ స‌ర్కారు మీద వ్య‌తిరేక‌త ఉంది. ఇన్నేళ్లుగా ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్పుడు వ్య‌తిరేక ఓటు మామూలే. అయిన‌ప్ప‌టికీ మేం దాన్ని అధిగ‌మిస్తామ‌ని చెప్పటం చిన్న ముచ్చ‌టేం కాదు.

మ‌రో కీల‌క‌మైన విష‌యం ఏమిటంటే.. ఈసారి జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు మోడీ ప‌ర‌క్షంలో జ‌ర‌గ‌నున్నాయి. సీన్లో మోడీ ఉంటే ఆయ‌న చేసే మేజిక్ తో ఫ‌లితాలు ప్ర‌భావితం అయ్యే అవ‌కాశం ఉంది. కానీ.. తాజా ఎన్నిక‌లు మోడీ నేతృత్వంలో జ‌ర‌గ‌నున్నాయి. ఇదిలా ఉంటే.. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో అధికార బీజేపీకి తిరుగులేద‌ని.. విజ‌యం త‌థ్య‌మ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఇలా తెలుగు దిన‌ప‌త్రిక‌ల్లో వ‌చ్చే వార్త‌ల‌న్ని పిటీఐ లాంటి ఏజెన్సీ వార్త‌లే. నిజానికి తెలుగు వ్య‌క్తి గుజ‌రాత్ కు వెళ్లి.. గ్రౌండ్ రిపోర్టింగ్ చేస్తే అస‌లు విష‌యం మ‌రింత స్ప‌ష్టంగా తెలిసే వీలుంది. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కూ తెలుగు మీడియాకు చెందిన ఏ విలేక‌రి గుజ‌రాత్‌ కు వెళ్ల‌లేదు (తెలుగు మీడియా త‌ర‌ఫున‌)

ఈ కొర‌త‌ను తీరుస్తూ.. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ కృష్ణారావు అనే సీనియ‌ర్ మోస్ట్ పొలిటిక‌ల్ రిపోర్ట‌ర్‌ ను గుజ‌రాత్ పంపింది. రాజ‌కీయ విశ్లేష‌ణ‌ల విష‌యంలో మొన‌గాడు లాంటి కృష్ణారావు ఇచ్చిన తొలి గ్రౌండ్ రిపోర్ట్ లో ఆస‌క్తిక‌ర అంశాలు బోలెడ‌న్ని ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ చెప్పిన‌ట్లుగా గుజ‌రాత్ ఎన్నిక‌లు మోడీకి విజ‌యాన్ని సులువుగా తీసుకురావ‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

ఇంత‌కీ ఆయ‌నేం చెప్పారు? ఆయ‌న గ్రౌండ్ రిపోర్ట్ లో కీల‌క‌మైన అంశాలు ఏం ఉన్నాయి అన్న‌ది చూస్తే..

= జీఎస్టీ వచ్చిన తర్వాత తమకు చాలా నష్టం జరుగుతోందని అహ్మ‌దాబాద్ వీధుల్లో తిరుగుతున్న‌ప్పుడు అక్కడి చిన్న వ్యాపారులు చాలామంది చెబుతున్నారు. అహ్మదాబాద్‌ భారతీయ జనతా పార్టీకి కంచుకోట లాంటిది. 2012లో ఇక్కడ ఉన్న 21 సీట్లలో బీజేపీ 17 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన నలుగురిలో ఒకరు పార్టీ ఫిరాయించారు. కాని స్థానికుల మాటలు వింటుంటే ఈసారి ఇక్కడ కాంగ్రెస్‌ సీట్ల సంఖ్య చెప్పుకోదగ్గ విధంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్‌ లో ఎవర్ని అడిగినా ‘ఈసారి గట్టిపోటీ నడుస్తోంది’ అంటున్నారు. కొందరైతే ‘బీజేపీ కో మార్‌ పడేగా(దెబ్బతగులుతుంది)’ అంటున్నారు. ధరలు బాగా పెరిగాయని. ‘‘టమాటాలు రూ.50కి కొంటున్నాం సార్‌. గ్యాస్‌ ధర రూ.700 దాటింది. కరెంట్‌ బిల్లు బాగా పెరిగిపోయింది. పిల్లలకు పుస్తకాలు కొందామనుకున్నా డబ్బులు మిగలట్లేదు’’ అని చాలామంది చెబుతున్నారు.

= ‘ఎంత కష్టపడ్డా ఏమీ మిగలడం లేదు. ఈ మోదీ సర్కార్‌ వచ్చిన తర్వాత వచ్చింది వచ్చినట్లు ఖర్చవుతోంది’’ అని అహ్మదాబాద్‌ లో ఒక ఆటోడ్రైవర్‌ వాపోయాడు. ‘‘నోట్ల రద్దు తర్వాత చాలా కష్టపడ్డాం. రోజుల తరబడి క్యూల్లో నిలుచున్నాము. ఒక్క సంపన్నుడైనా క్యూలో నిలుచోగా చూడలేదు’’ అని ఒక పాన్‌ డ బ్బా యజమాని చెప్పాడు. ‘‘పక్కాగా ఇది అమీరోంకా సర్కార్‌ సార్‌ - ధనికులకు ఏ కష్టమూ కలగలేదు. వాళ్లు మరిం త సంపన్నులవుతున్నారు’’ అని ఓ చాయ్‌ వాలా చెప్పాడు.

= ‘‘ఆధార్‌ తీసుకురా - ఓటరు గుర్తింపు కార్డు తీసుకురా.. ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు పెట్టు - డిజిటల్‌ చెల్లింపులు చేయి.. డెబిట్‌ కార్డు తీసుకో..’’ ఈ మాటలన్నీ చాలా మంది పేదప్రజలకు అర్థం కావట్లేదు. వారు అధికారుల చుట్టూ తిరగలేకపోతున్నారు. సబ్సిడీలు వారికి చేరడం లేదు. ఇది కూడా అసంతృప్తికి దారితీస్తోంది’’ అని ఓ యువకుడు చెప్పారు.

= కేంద్రంలో మోదీ వచ్చాక తీసుకున్న చర్యలతో తమ వ్యాపారం చాలావరకూ పడిపోయిందని ఆశ్రమ్‌ రోడ్డులో ఉన్న ఖాదీభాండార్ల యజమానులు చెబుతున్నారు. ‘‘మా వ్యాపారం చాలా పడిపోయింది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాము. మాకు రావాల్సిన సబ్సిడీ రావట్లేదు. తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది’’ అని వారు అంటున్నారు.

= 22 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల సహజంగా ఉన్న వ్యతిరేకతకు తోడు.. జీఎస్టీతో వ్యాపారాలు దెబ్బతినడం - నిరుద్యోగ సమస్య - ధరల పెరుగుదల - మోదీ ప్రభుత్వం పేదలకు ఏమీ చేయడం లేదనే అభిప్రాయం పెరగడం చాప కింద నీరులాగా బీజేపీకి వ్యతిరేకంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా దళితులు - ముస్లింలు - చిన్న వ్యాపారులు - ఆటో డ్రైవర్లు బహిరంగంగా తమ వ్యతిరేకతను - అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే నాణేనికి రెండోవైపు ఉన్నట్టు.. మోదీకి మద్దతునిచ్చే వారు అత్యధికంగా కాలనీల్లో కనపడుతున్నారు. ‘‘విధానాల అమలులో మోదీ కొన్ని తప్పులు చేసి ఉండవచ్చుగానీ.. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయన కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. వాటి ఫలితాలు ప్రజలకు తప్పక చేరుతాయి’’ అని రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ ఒకరు అభిప్రాయపడ్డారు.

= మోదీ - అమిత్‌ షాను తక్కువ అంచనా వేయలేమని - వారు ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన వారని. ఎన్నికల్లో గెలవడం తప్ప వారికి వేరే లక్ష్యం ఏమీ లేదని ఒక రాజకీయ పరిశీలకుడు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద అందరూ కూడా.. బీజేపీకి కంచుకోట అయిన అహ్మదాబాద్‌ లో కూడా చాలా చోట్ల మెజారిటీ తగ్గిపోతుందని. కాంగ్రెస్‌ సీట్ల సంఖ్యను పెంచుకుంటుందని చెబుతున్నారు. ఎన్ని సీట్లు తగ్గిపోతాయి, బీజేపీ అధికారాన్ని కోల్పోతుందా అనే విషయాన్ని మాత్రం ఎవరూ ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. బీజేపీ అహ్మదాబాద్‌ లోనే దెబ్బతింటే సూరత్‌ - బరోడా లాంటి చోట్ల ఇంకా దెబ్బతింటుందని, ఫలితాలు తారు మారవుతాయని గుజరాతీ పత్రిక సంపాదకుడొకరు విశ్లేషించారు.