Begin typing your search above and press return to search.

వైసీపీ మేనిఫెస్టోను బయటకు తీసి మరీ వైరల్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   31 July 2022 5:36 AM GMT
వైసీపీ మేనిఫెస్టోను బయటకు తీసి మరీ వైరల్ చేస్తున్నారు
X
కాలం మారింది. గతానికి భిన్నంగా తమకు తోచింది చెప్పేస్తే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడు నడుస్తున్నది యూట్యూబ్ కాలం. ఇలాంటివేళ.. ఏదో చెప్పేస్తే సరిపోదు. అందునా అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు రాజకీయ మైలేజీ కోసం కక్కుర్తి పడితే.. మొదటికే మోసం వస్తుంది. తాజాగా ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పుణ్యమా అని వైసీపీకి పెద్ద కష్టమే వచ్చి పడింది. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే మంత్రిగా పేరున్న ఆయన.. తాజాగా అధికార పార్టీని తన మాటలతో అడ్డంగా బుక్ చేశారు.

'మా మేనిఫెస్టోలో మద్యపాన నిషేధమనే మాటే లేదు. మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం ఏదైనా చేయలేదంటే మీరు క్వశ్చన్‌ చేయండి. మేనిఫెస్టోలో మేం చెప్పిన మాట మద్యం రేట్లు పైవ్‌స్టార్‌ రేట్లకు మించి పెడతాం. ఎవరన్నా ముట్టుకుంటే షాక్‌ కొట్టే పరిస్థితి తీసుకొస్తాం అనే చెప్పాం. ఏ గవర్నమెంట్‌ ఆఫీసుకెళ్లినా మా మేనిఫెస్టో గోడలపై ఉంటుంది. దాన్ని చూసుకోండి... అందులో పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఉంటే మేం ఒప్పుకుంటాం'' అని అంటూ విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడేశారు.

ఇంకేముంది.. క్షణాల్లో గూగులమ్మ బటన్ నొక్కినంతనే.. వైసీపీ మేనిఫెస్టో తెర మీదకు రావటం.. దాన్ని సేవ్ చేసి మరీ షేర్ చేస్తున్నారు. మంత్రిగారి నోటి నుంచి మాటలు ఒకవైపు.. మరోవైపు వైసీపీ ఎన్నికల మేనిఫేస్టోను ప్రదర్శిస్తూ.. నిజం మాటేమిటో చూడాలని కోరుతున్నారు. మేనిఫేస్టోలో చివరి అంశంగా మద్యపాన నిషేధాన్ని స్పష్టంగా పేర్కొనటం తెలిసిందే. ''కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యాన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తాం'' అని పేర్కొంటూ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీని మంత్రిగారి మడత పెట్టేసిన వైనంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

ఏపీ మంత్రిగారి మాటల నేపథ్యంలో మేనిఫోస్టోను దుమ్మ దులిపి మరీ దూకుడుగా షేర్ చేస్తున్న వైనం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఇలాంటి తీరుతో పార్టీకి జరిగే నష్టం భారీగా ఉంటుందని చెబుతున్నారు. మంత్రిగారి మాటల హడావుడికి బ్రేకులు వేస్తూ.. మీడియాకు చెందిన కొందరు ప్రతినిధులు.. దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారన్న మాటను గుర్తు చేస్తే.. తనకు అలవాటైన దూకుడును ప్రదర్శిస్తూ.. మీది తెలుగు పేపరే కదా? మా మేనిఫెస్టో తెలుగులోనే పెట్టాం కదా అర్థం చేసుకోండంటూ తన అధికారాన్ని చూపించిన వైనంతో మీడియా ప్రతినిధుల షాక్ తిన్నట్లు చెబుతున్నారు. మంత్రిగారి పిడి వాదనను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వైనం అధికారపార్టీకి తలనొప్పిగా మారినట్లుగా చెప్పక తప్పదు.