Begin typing your search above and press return to search.

రూ.వెయ్యి కోట్ల కుంభ‌కోణంలో లోకేష్‌

By:  Tupaki Desk   |   20 Sep 2016 7:05 AM GMT
రూ.వెయ్యి కోట్ల కుంభ‌కోణంలో లోకేష్‌
X
ఏంటి టైటిల్ చూసి నోరెళ్ల బెడుతున్నారా? ఇది నిజ‌మే అంటున్నారు వైసీపీ నేత ఒక‌రు. సాక్షాత్తూ సీఎం చంద్ర‌బాబు కుమారుడు - టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ వెయ్యి కోట్ల విలువైన భూ కుంభ‌కోణంలో కూరుకుపోయార‌ని విప‌క్ష నేత ఆరోపించారు. అంతేకాదు, త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన నిజాల‌ను కూడా బ‌య‌ట‌పెడ‌తాన‌ని ఆయ‌న చెప్ప‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. విష‌యంలోకి ఎంట‌రైపోతే.. విశాఖ‌కు చెందిన వైసీపీ నేత గుడివాడ అమ‌ర్నాథ్ మంగ‌ళ‌వారం ఓ టీవీ చ‌ర్చ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న లోకేష్‌ పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. విశాఖ భూదందాలో లోకేష్ రింగ్ తిప్పుతున్నార‌ని అన్నారు. విశాఖలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పారు.

విశాఖ‌లోని ఓ కీల‌క ప్రాంతంలో వెయ్యి కోట్ల రూపాయ‌ల విలువైన‌ భూమికి సంబంధించిన లావాదేవీల్లో చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారని అమర్‌ నాథ్ చెప్పారు. ఈ ఆరోప‌ణ‌లు ఉత్తివేకావ‌ని - త‌న ద‌గ్గ‌ర ప‌క్కా ఆధారాలు కూడా ఉన్నాయ‌ని గుడివాడ పేర్కొన్నారు. అయితే, ఈ సాక్ష్యాల‌ను తాను ఓ వారంలోగా బ‌య‌ట పెడ‌తాన‌ని త‌న‌కు తానే స‌మ‌యం ప్ర‌క‌టించుకున్న అమ‌ర్‌ నాథ్.. సీఎం కుమారుడిపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప్రభుత్వానికి - రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మధ్య గ‌త కొన్నాళ్లుగా ఈ వివాదం న‌డుస్తోంద‌ని - అయితే, దీనిలోకి లేటెస్ట్‌ గా ఎంట‌రైన లోకేష్ పూర్తిస్థాయిలో స్టోరీ న‌డిపిస్తున్నార‌ని అన్నారు.

మొత్తంగా దీనిద్వారా వెయ్యి కోట్ల మేర‌కు ల‌బ్ధి పొందాల‌ని లోకేష్ స్కెచ్ రెడీ చేశార‌ని అమ‌ర్ నాథ్ ఆరోపించారు. అయితే, తాను చెబుతున్న‌వ‌న్నీ వాస్త‌వాలేన‌ని, నిరూపించేందుకు వారం ప‌డుతుంద‌ని చెప్పుకొచ్చారు. మ‌రి చూద్దాం.. వారం త‌ర్వాత ప‌రిస్థితి ఎలా ఉంటుందో. ఇక‌, నారా లోకేష్ గురించి గ‌తంలోనూ ఇలాంటివే కొన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో ఉన్న స‌దావ‌ర్తి స‌త్రం భూముల వ్య‌వ‌హారంలో లోకేష్ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. అయితే, ఈ కేసులో కోర్టు తీర్పు చెప్ప‌డంతో ఇది తెర‌మ‌రుగైపోయింది. ఇక‌, తాజా ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో లేదో చూడాలి.