Begin typing your search above and press return to search.

అనంత టీడీపీలో అనేక పంచాయ‌తీలు

By:  Tupaki Desk   |   7 Feb 2017 9:24 AM GMT
అనంత టీడీపీలో అనేక పంచాయ‌తీలు
X
తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న హిందూపురంలో బాల‌య్య పీఏ వ్య‌వ‌హ‌రం టీడీపీ ప‌రువును బ‌జారు పాలు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే హిందూపురమే కాకుండా అనంత‌పురం జిల్లాలో అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితులు ఉన్నాయ‌ని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి అనంతపురం జిల్లాలో 'మూడు గ్రూపులు- ఆరు తగాదాలు'గా పోరు సాగుతోంది. అనంతపురం - హిందూపురం - కదిరి - తాడిపత్రి నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా హిందూపురం నియోజకవర్గంలో ముసలం మొదలైంది. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు శేఖర్‌ వ్యవహారశైలిని తప్పుబడుతూ పది రోజులుగా జిల్లాలో వివాదం కొనసాగుతోంది. ఒక గ్రూపు పీఏ శేఖర్‌ ను సమర్థిస్తుండగా, మరొక గ్రూపు ఆయన్ను తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ప్రత్యక్ష పోరు తారా స్థాయికి చేరింది.

అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి - నగర మేయర్‌ స్వరూపల మధ్య విభేదాలు ప్రారంభం నుంచే ఉన్నాయి. మధ్యలో కొంతకాలం ఇద్దరూ కలసినట్టు కనిపించినా మళ్లీ కథ మొదటికే వచ్చింది. ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి - ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కదిరిలో మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ - వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌ బాషాల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఇద్దరి మధ్య సయోధ్యకు పార్టీ జిల్లా ఇంఛార్జీ మంత్రి కొల్లు రవీంద్ర చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. కదిరి నాయకుల మధ్య సయోధ్య కోసం జిల్లాలో ఐదుగురు సభ్యులతో ఒక కమిటీనీ వేశారు. నియోజకవర్గాల్లో అంతర్గత గ్రూపులు కాకుండా నాయకుల మధ్య చూస్తే మరిన్ని గ్రూపులు కొనసాగుతున్నాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే జి.సూర్యనారాయణల మధ్య ప్రత్యక్ష పోరే సాగుతోంది. ధర్మవరంలో ప్లెక్సీల వివాదం ఇరు గ్రూపుల మధ్య విభేదాలను రచ్చకీడ్చింది. రెండు గ్రూపులు బహిరంగంగానే బాహాబాహీకి సిద్ధపడటం తో అదుపు చేసేందుకు పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. హిందూపురం పార్లమెంటు సభ్యు లు నిమ్మలకిష్టప్ప, పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారధిల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పార్టీ జిల్లా ఇంఛార్జీ మంత్రి కొల్లు రవీంద్ర ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇది ఎంతవరకు కొనసాగుతున్నది చూడాల్సి ఉంది. సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నియోజకవర్గంలోనూ అసమ్మతి మొదలైంది. పుట్టపర్తి మున్సిపల్‌ చైర్మ న్‌ మంత్రికి వ్యతిరేకంగా పలుమార్లు ప్రకటనలు చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విభేదాలు ఏదో ఒక రూపంలో బయటకు వస్తున్నాయి. కొన్నిసార్లు నేరుగా సీఎం చంద్రబాబే జోక్యం చేసుకుని హెచ్చరికలు చేసినా తగ్గకపోగా, మరింత అధికమవుతుండటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/