Begin typing your search above and press return to search.

అమరావతికి ‘అనుమతులు’ వచ్చేశాయి

By:  Tupaki Desk   |   14 Oct 2015 8:58 AM GMT
అమరావతికి ‘అనుమతులు’ వచ్చేశాయి
X
ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న శంకుస్థాపనకు అడ్డంకిగా భావిస్తున్న తలనొప్పులన్నీ తాజాగా తొలిగిపోయినట్లే. శంకుస్థాపనకు సంబంధించి పర్యావరణ అనుమతులు ఇంకా రాని నేపథ్యంలో.. శంకుస్థాపన వ్యవహారంలో ఏమైనా ట్విస్ట్ చోటు చేసుకుంటుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి ఇలాంటి అంచనాల్లో ‘పస’ తక్కువే.

ఎందుకంటే.. సాక్ష్యాత్తు దేశ ప్రధాని హాజరై.. ఆయన చేతుల మీదుగా జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వ పరమైన అడ్డంకులు ఉండే అవకాశమే ఉండదు. నిజానికి ప్రభుత్వం పాజిటివ్ గా ఉండాలే కానీ.. ఫైళ్లు యుద్ధప్రాతిపదికన నడిచిపోవు. అయితే.. అర్థం లేకుండా కొందరు ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి హడావుడి చేసి.. లేనిపోని అయోమయానికి గురి చేస్తున్న పరిస్థితి.

ఇలాంటి వాటికి తెర దించుతూ తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటన చేశారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులన్నీ వచ్చేసినట్లుగా ఆయన ప్రకటించారు. కేంద్రమంత్రి చేసిన ప్రకటనతో అమరావతి శంకుస్థాపనకు సంబంధించి అనవసరమైన ఊహాగానాలకు తెర పడినట్లుగా చెప్పొచ్చు.