Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ గెలుపుపై ధీమా.. ఏపీకి వ‌చ్చేయ‌నున్న అధికారులు!

By:  Tupaki Desk   |   7 May 2019 5:17 AM GMT
జ‌గ‌న్ గెలుపుపై ధీమా.. ఏపీకి వ‌చ్చేయ‌నున్న అధికారులు!
X
ఏపీలో పోలింగ్ జ‌రిగి దాదాపుగా రెండు వారాలు కావొస్తోంది. క్యాలెండ‌ర్లో రోజులు గ‌డుస్తున్న కొద్దీ.. ఏపీలో జ‌గ‌న్ ప‌వ‌ర్లోకి వ‌స్తార‌న్న న‌మ్మ‌కం అంత‌కంత‌కూ పెరుగుతోంది. లెక్క‌లు.. డొక్క‌ల‌తో పాటు.. వివిధ స‌మీక‌ర‌ణాలతో పాటు.. పోలింగ్ త‌ర్వాత సేక‌రిస్తున్న శాంపిల్స్ అని జ‌గ‌న్ కు అనుకూలంగా ఉండ‌టంతో జ‌గ‌న్ కాబోయే ముఖ్య‌మంత్రి అన్న భావ‌న అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది.

ఇదిలా ఉంటే.. జ‌గ‌న్ ప‌వ‌ర్లోకి వ‌స్తే.. ఏపీకి తిరిగి వ‌చ్చేందుకు ప‌లువురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఏపీ క్యాడ‌ర్ కు చెందిన ప‌లువురు సీనియ‌ర్ అధికారులు డిప్యుటేష‌న్ లో భాగంగా వివిధ విభాగాల్లో సేవ‌లు అందిస్తున్నారు. అలాంటి వారిప్పుడు హోం స్టేట్ కు వ‌చ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కొంద‌రు అధికారులైతే.. ఇందుకు సంబంధించిన పేప‌ర్ వ‌ర్క్ తో పాటు.. లాబీయింగ్ కూడా పూర్తి చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. జ‌గన్ ప‌వ‌ర్లోకి వ‌చ్చినంత‌నే.. త‌మ అవ‌స‌రం ఉంద‌న్న భావ‌న‌ను వారు వ్య‌క్తం చేస్తున్నారు.

వైఎస్ హ‌యాంలో కీల‌క స్థానాల్లో ఒక వెలుగు వెలిగి.. త‌ర్వాతి రోజుల్లో అప్రాధాన్య‌త పోస్టుల‌కు ప‌రిమిత‌మ‌వుతున్న వారంతా ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో త‌మ స‌త్తా చాటాల‌ని.. పాల‌న‌లో జ‌గ‌న్ ముద్ర ప‌డేలా చేయాల‌ని త‌పిస్తుండ‌టం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ ప‌వ‌ర్లోకి వ‌చ్చినంత‌నే ముఖ్య స్థానాల‌కు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోవ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.