Begin typing your search above and press return to search.

టీటీడీలో కరోనా.. రెండు రోజుల ఆలయం మూసివేత

By:  Tupaki Desk   |   12 Jun 2020 1:34 PM GMT
టీటీడీలో కరోనా.. రెండు రోజుల ఆలయం మూసివేత
X
కోరిన కోర్కెలు తీర్చే తిరుమల వెంకన్న దర్శనం జూన్ 8 నుంచి ప్రారంభమైంది. కరోనా-లాక్ డౌన్ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టంగా భక్తులను నిబంధనల ప్రకారం తక్కువమందిని అనుమతిస్తున్నారు. మార్చి 25న తిరుమల శ్రీవారి ఆలయం బంద్ కాగా.. జూన్ 8 నుంచి భక్తులను అనుమతిస్తున్నారు.

ప్రస్తుతం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తుల రాక మొదలైంది. అయితే తాజాగా టీటీడీ అనుబంధ దేవాలయాల్లో కరోనా మహమ్మారి వెలుగుచూసింది.

టీటీడీ అనుబంధ దేవాలయాల్లో ఒకటైన తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పనిచేస్తున్న ఓ శానిటేషన్ ఇన్ స్పెక్టర్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు.

తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయాన్ని రెండు రోజుల పాటు మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆలయాన్ని పూర్తి స్థాయిలో శానిటేషన్ చేసిన తరువాత ఆదివారం నుంచి తెరుస్తామని టీటీడీ తెలిపింది. శానిటేషన్ ఇన్ స్పెక్టర్ ఎవరెవరిని కలిశాడు. ఆలయంలో ఎవరితో మెలిగాడనే దానిపై ఆరాతీస్తున్నారు.