Begin typing your search above and press return to search.

ఈ వరుస తప్పులేంది సామీ.. గవర్నర్ కు మళ్లీ అవమానం!

By:  Tupaki Desk   |   3 April 2022 4:01 AM GMT
ఈ వరుస తప్పులేంది సామీ.. గవర్నర్ కు మళ్లీ అవమానం!
X
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైకు మరోసారి అవమానం జరిగింది. రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు. కానీ..రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి దక్కాల్సిన గౌరవం.. మర్యాదల విషయంలో అస్సలు లోటు రాకూడదు. ఇక్కడ ఇచ్చే గౌరవ.. మర్యాదలన్నీ వ్యక్తులకు కాదు.. వారున్న స్థానాలకు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయితే.. ఈ విషయాన్ని మిస్ అవుతున్న సీఎం కేసీఆర్.. గవర్నర్ తమిళ సైకు వరుస పెట్టి షాకులు ఇస్తున్నారు. తాజాగా యాదాద్రిలోని లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

రాష్ట్రానికి తొలి పౌరురాలిగా ఆమెకు ఇవ్వాల్సిన మర్యాద విషయంలో ఇసుమంత లోటు కూడా రానివ్వకూడదు. కానీ.. అవేమీ పట్టని ప్రభుత్వం.. ఆమెకు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సిన ఆలయ ఈవో.. జిల్లా కలెక్టర్ స్వాగతం పలకని వైనం.. వారి స్థానంలో అదనపు కలెక్టర్.. ఆలయ ఏఈవోలు మాత్రమే గవర్నర్ కు స్వాగతం పలకటం లాంటివి చూసినప్పుడు.. గవర్నర్ ను ఇలా అవమానించి సీఎం కేసీఆర్ సాధించేదేమిటి? అన్న సందేహం రాక మానదు.

ఎందుకంటే.. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు చాలా భిన్నం తెలంగాణ. ఈ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులు. దేన్నైనా భరిస్తారు కానీ.. ఎవరినైనా టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నట్లుగా భావిస్తే.. అలాంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. తెలంగాణ ప్రజల చైతన్యం గురించి కేసీఆర్ కు కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. తెలంగాణ ప్రజల్లోని ఆ ఫైర్ తోనే ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ తన లక్ష్యాన్ని చేరుకోగలిగారని చెప్పాలి. వేరే రాష్ట్రంలో ఇలాంటి చైతన్యం కాస్త తక్కువే.

గవర్నర్ తమిళ సైకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి.. దానికి సంబంధించిన ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్న వేళలో.. సీఎం కేసీఆర్ చేసిన రికమండేషన్ ను కొట్టి పారేస్తూ.. గవర్నర్ నిర్ణయం తీసుకోవటం.. అప్పటి నుంచి దూరం పెరిగిన విషయంతెలిసిందే.

ఉగాది సందర్భంగా శుక్రవారం రాత్రి రాజ్ భవన్ లో జరిగిన ఉగాది వేడుకులకు సీఎం కేసీఆర్ ను గవర్నర్ ఆహ్వానించినప్పటికీ ఆయన రాకపోవటం తెలిసిందే. తెలంగాణ అధికార పార్టీకి చెందిన మంత్రులతో పాటు సీఎస్.. డీజీపీలు సైతం గైర్హాజరు కావటం చర్చగా మారిన వేళలో.. తర్వాతి రోజునే గవర్నర్ కు మరో అవమానం కలిగేలా పరిస్థితులు చోటు చేసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గవర్నర్ ను తరచూ అవమానానికి గురి చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నఆరోపణలు ఎక్కువయ్యేలాతాజా పరిణామం ఉందంటున్నారు. గవర్నర్ పై ఆగ్రహం ఉంటే మరోలా ప్రదర్శించాలే తప్పించి.. ప్రోటోకాల్ కు భంగం వాటిల్లేలా వ్యవహరించటం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తాజాగా యాదాద్రికి వచ్చిన గవర్నర్ పట్ల వ్యవహరించిన తీరును చూస్తే.. ప్రభుత్వ పరంగా గవర్నర్ కు కల్పించాల్సిన ప్రోటోకాల్ సౌకర్యాలను.. లాంఛనాల్ని పూర్తిగా తొలగించినట్లుగా చెబుతున్నారు. గవర్నర్ వర్సస్ ముఖ్యమంత్రి అన్నది కొత్తేం కానప్పటికీ.. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా ఇక్కడ గవర్నర్ ను సీఎం టార్గెట్ చేసినట్లుగా ఉండటం.. ఆమెను వరుస పెట్టి అవమానిస్తున్నట్లుగా ఉండటం సీఎం కేసీఆర్ కు మైనస్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది. వరుస పెట్టి అవమానాలకు గురైన వారి పట్ల ప్రజల్లో సానుభూతి పెరిగితే.. అది సీఎం కేసీఆర్ కు షాకిచ్చేలా మారుతుందన్న లాజిక్ ను గులాబీ బాస్ ఎందుకు మిస్ అవుతున్నారు?