Begin typing your search above and press return to search.

ఆర్టీసీ సమ్మెపై మోడీకి గవర్నర్ ఇచ్చిన రిపోర్ట్ లో ఏముంది?

By:  Tupaki Desk   |   16 Oct 2019 4:52 AM GMT
ఆర్టీసీ సమ్మెపై మోడీకి గవర్నర్ ఇచ్చిన రిపోర్ట్ లో ఏముంది?
X
గడిచిన పదకొండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ కేంద్రానికి చేరింది. రాష్ట్రంలో అసలేం జరిగింది? సమ్మె విషయంలో ఎవరెంత బాధ్యులు? అన్న విషయాలతో పాటు.. సమ్మె విషయంలో ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రత్యేకంగా రిపోర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

పండుగ వేళ ప్రజా రవాణా అందుబాటులో లేని నేపథ్యంలో ప్రజలు పడిన కష్టాల గురించి కూడా ఆమె రిపోర్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సమ్మెను నివారించేందుకు ఉన్న అవకాశాల్ని సీఎం కేసీఆర్ వదిలేశారన్న అంశంపైనా తమిళసై తనదైన శైలిలో రిపోర్ట్ ఇచ్చినట్లుగా సమాచారం. ప్రధాని మోడీతో దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయిన తమిళసై.. ఆర్టీసీ సమ్మె జఠిలంగా మారటానికి.. ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవటానికి దోహదం చేసిన అంశాలేమిటి? అన్న విషయం మీదా ఆమె వివరాలు అందించినట్లు తెలుస్తోంది.

ఈ నెల ఐదు అర్థరాత్రి నుంచి చేపట్టిన సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. సమ్మెను నివారించే అవకాశం ఉన్నా ప్రభుత్వం చొరవ తీసుకోలేదని చెప్పటంతో పాటు.. 48 వేల మంది ఉద్యోగుల్ని సెల్ప్ డిస్మిస్ గా ప్రకటించటంతో పరిస్థితి మరింత తీవ్రతరం కావటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన తీరే ప్రధానమన్న విషయాన్ని మోడీషాల వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.

ఉద్యోగులు సెల్ప్ డిస్మిస్ అయ్యారంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనల కారణంగానే ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్యను చేసుకున్నారని.. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా ఆమె చెప్పినట్లుగా సమాచారం. కేసీఆర్ సర్కారుపైన పూర్తి నెగిటివ్ రిపోర్ట్ కేంద్రానికి చేరినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె విషయంలో పీటముడులు పడేందుకు గులాబీ బాసే కారణమన్న విషయంపైన మోడీషాలకు ఫుల్ క్లారిటీ వచ్చినట్లేనని తెలుస్తోంది.