Begin typing your search above and press return to search.

కేసీఆర్ వ్యూహానికి బ్రేక్‌.. కౌశిక్‌రెడ్డి నామినేష‌న్‌పై గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న కామెంట్లు

By:  Tupaki Desk   |   8 Sep 2021 3:30 PM GMT
కేసీఆర్ వ్యూహానికి బ్రేక్‌.. కౌశిక్‌రెడ్డి నామినేష‌న్‌పై గ‌వ‌ర్న‌ర్ సంచ‌ల‌న కామెంట్లు
X
ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టీఆర్ ఎస్ పార్టీలోకి వ‌చ్చిన ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌ జిల్లాకు చెందిన యువ నాయ‌కుడు.. కౌశిక్ రెడ్డి విష‌యంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై.. త‌న శైలిలో షాక్ ఇచ్చారు. హూజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో కౌశిక్‌రెడ్డి టీఆర్ ఎస్‌లోకి రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. రాజ‌కీయంగా ఇది పెను ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న కూడా హుజూరాబాద్ టికెట్‌ను ఆశించారు. అయితే.. అనూహ్యంగా.. కేసీఆర్ ఇక్క‌డ బీసీ నేత‌కు టికెట్ ఖ‌రారు చేసి.. కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. సేవా సాంస్కృతి రంగాల‌కు చెందిన కోటాలో కౌశిక్‌రెడ్డిని.. మండ‌లికి నామినేట్ చేశారు.

దీనికి కేసీఆర్ కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. ఇక‌, కౌశిక్‌రెడ్డి.. ఎమ్మెల్సీ అయిపోయిన‌ట్టేన‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అంతేకాదు.. కౌశిక్‌రెడ్డి అనుచ‌రులు మ‌రో అడుగు ముందుకు వేసి.. సీఎం కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. దేవుడు, రాముడు.. అంటూ.. ఆయ‌న పై కామెంట్లు కూడా చేశారు. అయితే.. అనూహ్యంగా ఈ ఫైల్ కు ఆమోదం తెల‌పాల్సిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై మాత్రం.. సంచ‌ల‌న కామెంట్లు చేశారు. రాజ్‌భవన్‌లో బుధవారం గ‌వ‌ర్న‌ర్ మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి సేవారంగం కోటాలో సిఫార్సు చేయ‌డంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సేవ‌కు సంబంధం లేని రంగాల‌కు చెందిన వారిని ఆ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేయ‌డం స‌రైంది కాద‌ని గ‌వ‌ర్న‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు.

కేసీఆర్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై ఆలోచించాల్సి ఉందని ఆమె చెప్పారు. ఈ ప‌రిణామం.. కేసీఆర్ ప్ర‌భుత్వానికి మింగుడు ప‌డే అవ‌కాశం లేదు. వాస్త‌వానికి కొన్నాళ్ల కింద‌ట‌ ప్రజాకవి గోరేటి వెంకన్నను ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ కేసీఆర్ ఫైల్ పంపితే, మరుసటి రోజే గవర్నర్ ఓకే చేశారు. కానీ కౌశిక్ రెడ్డి విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెల‌ప‌క‌పోవ‌డంతో అత‌ని నియామకంపై అనుమానాలు త‌లెత్తుతున్నాయి. కౌశిక్‌రెడ్డి నియామకానికి సంబంధించి మంత్రివర్గం సిఫార్సును మరింత అధ్యయనం చేయాల్సి ఉందని గవర్నర్ వ్యాఖ్యానించ‌డం.. ఇక‌, ఆయ‌న‌కు మండ‌లి ఛాన్స్ ద‌క్కే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కాగా, కొన్నాళ్ల కింద‌ట క‌రోనా స‌మ‌యంలోనూ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై.. త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రించారు. అప్ప‌ట్లో త‌నే స‌మీక్ష‌లు చేయ‌డం.. ఆదేశాలు జారీ చేయ‌డం.. ప్రైవేటు ఆసుప‌త్రులు ఫీజుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం.. వంటివి కేసీఆర్ స‌ర్కారుకు ఒకింత ఇబ్బందిగా మారాయి.అ యితే.. అప్ప‌ట్లో వివాదం పెర‌గ‌కుండా.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. స్వ‌యంగా రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి.. గ‌వ‌ర్న‌ర్‌తో సంప్ర‌దింపులు చేసి.. ప‌రిస్తితిని అదుపులోకి తెచ్చుకున్నారు. కానీ, ఇప్పుడు.. రాజ‌కీయంగా జ‌రిగిన కౌశిక్ రెడ్డి నియామ‌కం విష‌యంలో ఎదురు దెబ్బ‌త‌గిలే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రి ఈ విష‌యంలో కేసీఆర్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి.