Begin typing your search above and press return to search.

సర్కార్ వారి వైఫల్యం : ఇంటలిజెన్స్ ఏదీ.. ఎక్కడ...?

By:  Tupaki Desk   |   25 May 2022 9:30 AM GMT
సర్కార్ వారి వైఫల్యం :  ఇంటలిజెన్స్ ఏదీ.. ఎక్కడ...?
X
కోన సీమ జిల్లాలో నిన్న జరిగిన దారుణ మారణానికి అసలైన కారణం ఇంటలిజెన్స్ వైఫల్యం అని అంటున్నారు. చీమ చిటుక్కుమంటే కూడా నిఘా పెట్టి గుట్టు పట్టే ఇంటలిజెన్స్ ఒక్కసారిగా వేలాది మంది ఆందోళకారులు దూసుకురావడాన్ని ముందే ఎందుకు కనిపెట్టలేదు అన్నది ఇక్కడ ప్రశ్న. ఇక ఒకసారి వేలాది మంది పోగు అవడం అంటే ఆషామాషీ విషయం కాదు, దానికి ముందు తెర వెనక పెద్ద కసరత్తు జరుగుతుంది.

అలాగే దాని గురించి ఒక ఆలోచన ఉంటుంది. ఇక రాష్ట్ర మంత్రి ఇంటి మీద దాడి అంటే చిన్న విషయం కాదు, ఆ సమయాన మంత్రి విశ్వరూప్ అక్కడే ఉన్నారు. ఆయన తన సొంత ఆలోచనతో అక్కడ నుంచి వెళ్లిపోకపోతే ఏమి జరిగి ఉండేది అన్నది కూడా ఊహించడానికే ఇబ్బందికరం. మరి ఇంతటి సంఘటనకు ప్లాన్ వేసి వస్తున్న వారి గురించి సూచనా ప్రాయంగా ఇంటలిజెన్స్ కి ఉప్పు అందలేదా అన్నదే ఇక్కడ మరో ప్రశ్న.

అదే విధంగా మంత్రి ఇల్లు మంటలను అంటుకుని కాలిపోతున్న వేళ కూడా అక్కడ పోలీసులు కనిపించలేదని చెబుతున్నారు. రాత్రి పదిన్నర వరకూ అగ్ని మాపక దళాలు అక్కడికి చేరుకోలేదు అని అంటున్నారు. మరో వైపు పెట్రోల్ ప్యాకెట్స్ కూడా ఆ మంత్రి ఇంటిలోకి విసిరివేశారు. మరి ఇలాంటి దురాగతం జరుగుతూంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా అన్న దానికీ బదులు లేదు.

ఆ మధ్యన అంటే కొన్ని నెలల క్రితం విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమానికి వెల్లువలా వేలాదిగా తరలివచ్చారు అని ప్రభుత్వం గుస్సా అయింది. ఎంతో కట్టుదిట్టం చేసినా ఉద్యోగులు చీమలదండులా వచ్చారని, అలా వస్తారని ముందే గుర్తించకపోవడం ఇంటలిజెన్స్ వైఫల్యం అని కూడా నాడు సర్కార్ పెద్దలు భావించారు. ఫలితం డీజీపీ గౌతం సవాంగ్ కి తప్పించారు అని అంటారు.

మరి ఇపుడు అంతకంటే ఎక్కువగా దారుణం జరిగింది. మంత్రి తృటిలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. మరి ఇంతటి విపరీత వ్యవహారం జరుగుతుందని, ఆ మేరకు ఆందోళకారులలో ఆవేశం ఉందని ఎందుకు ఊహించలేకపోయారు అన్నదే ప్రశ్న. ఈ వైఫల్యం ఎవరి బాధ్యత. అంతే కాదు, ఆర్టీసీ బస్సులతో సహా ప్రైవేట్ వాహనాలూ దగ్దం అయిపోయాయి.

అదే విధంగా చూస్తే మరో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లు కూడా తగలబడిపోయింది. మరి ఇదంతా ఇంటలిజెన్స్ వైఫల్యం కాదు అని చెప్పగలరా. నిజానికి పోలీసులు చెబుతున్నది వేరుగా ఉంది. కలెక్టరేట్ కి ర్యాలీగా ఆందోళకారులు వస్తారని భావించి అక్కడ భద్రత పెంచారని అంటున్నారు. మరి అదే టైమ్ లో అంతా అక్కడే ఉంటే ఆందోళకారులు తమ ప్లాన్ మార్చి మంత్రి ఎమ్మెల్యే ఇళ్లను టార్గెట్ చేశారా. అంటే ఇక్కడ పోలీసుల ఎత్తుకు పై ఎత్తు వేసినట్లుగా అర్ధమవుతోంది కదా.

మరి మందీ మార్బలం అంతా ఉండి కూడా ఇలా అధికార యంత్రాంగం చతికిల పడదం ఏమిటి అన్న చర్చ ఊడా వస్తోంది. ఏది ఏమైనా ఇది దారుణమైన వైఫల్యం గానే చూస్తున్నారు. ఆందోళనలు కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. జనాలలో ఉద్రిక్తత ఉంది. అయినా కూడా ఏమీ జరగదులే అన్న ఉదాశీనతే కొంప ముంచింది అంటున్నారు. ఇపుడు అంతా అయ్యాక తాపీగా భద్రత పెంచి 144 సెక్షన్ అంటూ కట్టుదిట్టం చేసినా ఉపయోగం ఉందా.

ఏది ఏమైనా అధికార పార్టీకి చెందిన ఒక మంత్రికి, ఒక ఎమ్మెల్యేకు రక్షణ లేదు అని నిన్నటికి నిన్న తేలిపోయిన వేళ ఏపీలో లా అండ్ ఆర్డర్ కూడా ఇపుడు ప్రశ్నార్ధం అనే అంటున్నారు. ఆందోళకారులు చేశారు, వారి వెనకాల ఫలానా వారు ఉన్నారు అని జరిగిన తరువాత ఎలుగెత్తి మాట్లాడడం కాదు, ముందే ఎందుకు గమనించి అదుపు చేయలేకపోయరు అంటే సర్కారీ పెద్దలు జవాబు చెబుతారా. ఒక విధంగా ఇది సర్కార్ వైఫల్యాన్ని కూడా బట్టబయలు చేసింది అనే అంటున్నారు.