Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి పదవికి పోటీకి గోపాలకృష్ణ కూడా నో

By:  Tupaki Desk   |   20 Jun 2022 1:49 PM GMT
రాష్ట్రపతి పదవికి పోటీకి గోపాలకృష్ణ కూడా నో
X
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థి దొరకక ప్రతిపక్షాలు తలపట్టుకుంటున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయలేమని ఇప్పటికే ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్, నేషనల్ కాన్ఫరన్స్ అధినేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తేల్చిచెప్పారు. ఇప్పుడు మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. దీంతో ప్రతిపక్షాలు అనుకున్న ముగ్గురు అభ్యర్థులు పోటీకి నో చెప్పినట్టు అయ్యింది. దీంతో ఎవరినీ బరిలోకి దింపాలా అని విపక్షాలు ఆలోచిస్తున్నాయి.

కాగా గోపాల కృష్ణ గాంధీ తాను ఎందుకు పోటీకి నిరాకరిస్తున్నానో తెలిపారు. దేశ అత్యున్నత పదవికి పోటీ చేయాలని చాలా మంది గొప్ప నేతలు తనను అడగడం గౌరవంగా భావిస్తున్నానని గోపాలకృష్ణ గాంధీ చెప్పారు. తనను ఎంచుకున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి ప్రతిపక్షాల ఐక్యతతో పాటు యావత్ దేశ ఏకాభిప్రాయాన్ని సాధించే వ్యక్తి అయి ఉండాలనేది తన అభిప్రాయమన్నారు. తనకంటే మెరుగైన వ్యక్తులు ఈ పదవికి పోటీ చేయడానికి ఉన్నారనిపించిందని తెలిపారు. అందుకే తాను పోటీ చేయాలనుకోవడం లేదన్నారు. గోపాలకృష్ణ గాంధీ పేరును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృనమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

జూలై 18న జ‌ర‌గ‌బోయే రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు సంబంధించి ప్ర‌తిప‌క్షాల అన్నింటి త‌ర‌ఫున ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ చొర‌వ తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 17 పార్టీల అధినేత‌ల‌తో ఢిల్లీలో కొద్దిరోజుల క్రితం స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి శిరోమ‌ణి అకాలీద‌ళ్, జిజూ జ‌న‌తాద‌ళ్, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ వంటివి మిన‌హా దాదాపు మిగ‌తా అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు హాజ‌ర‌య్యాయి. చివ‌ర‌కు మ‌మ‌తా బెన‌ర్జీతో ఉప్పూనిప్పుగా వ్య‌వ‌హ‌రించే క‌మ్యూనిస్టు పార్టీలు సైతం వ‌చ్చాయి.

ఈ స‌మావేశంలో శ‌ర‌ద్ ప‌వార్ ను ప్ర‌తిపక్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో నిల‌పాల‌ని ఆ పార్టీలు నిర్ణ‌యించ‌గా ఆయ‌న తిర‌స్క‌రించారు. ప్ర‌ధాన‌మంత్రి ప‌దవి మీద మోజు తీర‌క‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న రాష్ట్ర‌ప‌తిగా ఉండ‌టానికి తిర‌స్క‌రించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక జ‌మ్ము క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్సు అధినేత‌ ఫ‌రూఖ్ అబ్దుల్లాను త‌మ అభ్య‌ర్థిగా రంగంలోకి దించాల‌ని నిర్ణ‌యించాయి. అయితే ఆయ‌న కూడా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి తిర‌స్క‌రించారు.

జ‌మ్మూకశ్మీర్ కు సుదీర్ఘ‌కాలం ముఖ్య‌మంత్రిగా ఫ‌రూఖ్ అబ్దుల్లా వ్య‌వ‌హ‌రించారు. బీజేపీ ప్ర‌భుత్వం జ‌మ్మూక‌శ్మీర్ కు రాష్ట్ర హోదాను తొల‌గించి కేంద్ర‌పాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది జ‌మ్ముక‌శ్మీర్ అసెంబ్లీకి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో మ‌రోమారు జ‌మ్ముక‌శ్మీర్ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగాల‌ని కోరుకుంటున్న ఫ‌రూఖ్ అబ్దుల్లా రాష్ట్ర‌ప‌తి ప‌దవిని చేప‌ట్ట‌డానికి నిరాక‌రించార‌ని తెలుస్తోంది.

అలాగే ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌ల‌సినా బీజేపీ అభ్య‌ర్థిని రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఓడించ‌డం క‌ష్టం. బీజేపీ, దాని మిత్ర‌ప‌క్షాల‌కు 49.1 శాతం మెజారిటీ ఉంది. అలాగే ప్ర‌తిప‌క్షాల‌కు 51.9 శాతం మెజారిటీ ఉంది. అయితే బీజేపీ ప్ర‌భుత్వానికి ఎలాంటి మ‌ద్దతు ఇవ్వ‌డానికైనా ఉవ్విళ్లూరుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఒడిశాలోని బిజూ జ‌న‌తాద‌ళ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తిచ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి సునాయాసంగా గెలుపొంద‌డం ఖాయం. ఈ నేప‌థ్యంలో ఓడిపోయే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఎందుక‌నే ఉద్దేశంతోనే ఫ‌రూఖ్ అబ్దుల్లా రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఉండ‌టానికి తిర‌స్క‌రించార‌ని చెబుతున్నారు.

కాగా రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌ను ఈ నెల 15న జారీ చేశారు. ఆ రోజు నుంచే నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభ‌ం అయ్యింది. ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తామ‌ని, 30న నామినేష‌న్ల ప‌రిశీలన ఉంటుంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జులై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంద‌ని తెలిపారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో పోలింగ్‌ను జులై 18న నిర్వ‌హిస్తామని.. జులై 21న ఓట్లను లెక్కిస్తామని తెలిపారు.