Begin typing your search above and press return to search.

అంబానీ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది 5జీ సేవలు

By:  Tupaki Desk   |   15 July 2020 2:00 PM GMT
అంబానీ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది 5జీ సేవలు
X
దేశంలో చాలానే కంపెనీలు ఉండొచ్చు. మరే కంపెనీకి లేని రీతిలో రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఏడాది తన వార్షిక సమావేశం సందర్భంగా ఆయన ఏదో ఒక ఆసక్తికర ప్రకటన చేస్తుంటారు. గత ఏడాది ఇదే సమావేశంలో.. తమ కంపెనీ అప్పుల్ని తీర్చేస్తామని.. అప్పుల్లేని కంపెనీగా మారుస్తామని మాట ఇచ్చారు. ఆయన మాట విన్న వారంతా ఆశ్చర్యపోయారు. కానీ.. ముకేశ్ చెప్పినట్లే చేసి చూపించారు.

కరోనా లాంటి కఠిన కాలంలోనూ తన జియో వాటాల్ని భారీ ధరలకు అమ్మే విషయంలో ఆయన సక్సెస్ అయ్యారు. చెప్పిన సమయం కంటే తక్కువ వ్యవధిలోనే రిలయన్స్ ను రుణ రహిత సంస్థగా మార్చటమే కాదు.. 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించిన తొలి భారతీయ కంపెనీగా చరిత్రను క్రియేట్ చేశారు. ఇదే విషయాన్ని ఈ రోజున ఆన్ లైన్ లో నిర్వహించిన ఏజీఎంలో వెల్లడించారు.

మానవ చరిత్రలో అత్యంత ఇబ్బందికర పరిస్థితిగా కరోనాను అభివర్ణించారు ముకేశ్ అంబానీ. కోవిడ్ తర్వాత భారత్ తో పాటు మిగిలిన ప్రపంచం కూడా వేగంగా కోలుకుంటుందన్న ఆయన.. ప్రతి కష్టం కొత్త అవకాశాల్ని తెచ్చి పెడుతుందని గుర్తు చేశారు. అందరి అంచనాలకు భిన్నంగా జియో సొంతంగా 5జీ సొల్యూషన్స్ ను డెవలప్ చేసిందని చెప్పారు.ఇది ప్రపంచ స్థాయి సేవల్ని అందిస్తుందని చెప్పారు.

వచ్చే ఏడాదికి ఈ సేవలు అందుబాటులోకి రావొచ్చని చెప్పిన ఆయన.. ప్రభుత్వం స్పెక్ట్రం రాగానే ప్రకటిస్తామని చెప్పారు. అంతేకాదు.. జియోలో 7.7 వాతం వాటాను గూగుల్ రూ.33,737 కోట్లు పెట్టుబడి పెట్టనుందని చెప్పారు. భారత్ లో అతి పెద్ద రైట్స్ ఇష్యూని కూడా పూర్తి చేశామన్నారు. గూగుల్ తో ఒప్పందం రానున్న కొన్ని వారాల్లోనే ఖరారు కావొచ్చన్న విషయాన్ని తాజాగా బ్లూంబర్గ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదికి 5జీ సేవలు ఇస్తామన్న మాటను చెప్పటం ద్వారా..సదరు స్పెక్ట్ట్రం విడుదలకు ప్రభుత్వ క్లియరెన్సు మాత్రమే మిగిలి ఉందన్న విషయాన్ని ముకేశ్ చెప్పకనే చెప్పినట్లైంది.