Begin typing your search above and press return to search.

పాలు తాగేందుకు బార్‌కు వెళ్తారట .. ఎక్కడంటే

By:  Tupaki Desk   |   25 Oct 2021 4:30 PM GMT
పాలు తాగేందుకు బార్‌కు వెళ్తారట .. ఎక్కడంటే
X
మాములుగా బార్లు అన‌గానే మ‌న‌కు మ‌ద్యం గుర్తుకు వ‌స్తుంది. మ‌ద్యం తాగేందుకు మందుబాబులు బార్ల‌కు వెళ్తుంటారు. అనేక దేశాల్లో మ‌ద్యం ద్వారానే అధిక ఆదాయం స‌మ‌కూర్చుకుంటారు. అయితే, ఆ దేశంలో కూడా బార్లు ఉన్నాయి. ఆ బార్ల‌లో మ‌ద్యం అమ్మ‌రు. మ‌ద్యం ప్లేస్‌లో పాలు అమ్ముతుంటారు. పాల కోస‌మే అక్క‌డి ప్ర‌జ‌లు బార్ల‌కు వ‌స్తుంటారు. అలాంటి దేశాలు కూడా ఉంటాయా అని షాక్ అవ్వ‌కండి. ర్వాండా దేశ రాజ‌ధాని కిగాలీలో ఎక్క‌డ చూసినా మ‌న‌కు బార్లు క‌నిపిస్తుంటాయి. ఆఫ్రికాలోని ర్వాండా దేశ రాజధాని కిగాలీలోకి ప్రజలు ప్రతి రోజూ బార్‌ కు వెళతారు. అక్కడ పాలు తాగుతారు. ఇది వారి సంప్రదాయంలో భాగమని న్యూ యార్క్ టైమ్స్ వెల్లడించింది.

ఇక్కడ పాలు తాగేందుకు వచ్చే వాళ్లు చెప్పే కారణాలు సహేతుకంగా ఉంటాయి. ప్రశాంతంగా ఉండేందుకు తాను రోజు పాలు తాగుతానని ఓ మోటార్ సైకిల్ డ్రైవర్ తెలిపాడు. అంతేకాదు పాలు తాగడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందని వెల్లడించాడు. తనతో పాటు అనేక మంది ఇదే కారణంతో పాలు తాగేందుకు బార్‌కు వస్తారని తెలిపారు. ర్వాండాలో పాలు ఎంతో పాపులర్ డ్రింక్. ఇక్కడ అనేక వర్గాలకు చెందిన ప్రజలు కలిసి పని చేస్తుంటారు. పురుషులు, స్త్రీలు ఇక్కడ పాల బార్లలో కలిసి కనిపిస్తారు. ఇక్కడ బార్లలో చల్లని పాలతో పాటు వేడి పాలు లభిస్తాయి. పాలతో పాటు కేక్‌లు, బ్రెడ్లు, అరటిపండ్లు తినేందుకు ఇక్కడ వాళ్లు ఆసక్తి చూపిస్తుంటారు. పాలు ఇక్కడి దేశ సంప్రదాయం, చరిత్రతో ముడిపడి ఉంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో పాలు ఓ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆవులు ఇక్కడ ప్రజల ఆదాయంలో ఎంతో కీలకం.

ఈ దేశంలో 1994లో జరిగిన మారణకాండలో 8 లక్షల మంది చనిపోయారు. వాళ్లలో ఎక్కువమందిని టుటీస్ అంటారు. వాళ్లలో ఎక్కువమంది పశువులు, గొర్ల కాపర్లే. ఆ మారణకాండ నుంచి దేశం కోలుకోవడంతో ఇప్పుడు మళ్లీ ఆవును పెంచుతూ దేశం పౌష్టికాహార లోపాన్ని తగ్గించడంతో పాటు ఆర్థికంగా బలపడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దేశ అధ్యక్షుడు పాల్ కగామే 2006లో గిరింకా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీన్ని ప్రకారం దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఒక ఆవును ఇస్తారు. ఆ దేశ ప్రభుత్వం లెక్కల ప్రకారం ఇప్పటివరకు అక్కడ 3 లక్షల 80 వేల ఆవులు పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం ఈ దేశంలోని ఓ గ్రామానికి 200 ఆవులు పంపిణీ చేశారు.