Begin typing your search above and press return to search.

నోబెల్ విజేత మాట‌ను బీజేపీ గౌర‌విస్తుందా?

By:  Tupaki Desk   |   18 May 2019 11:44 AM GMT
నోబెల్ విజేత మాట‌ను బీజేపీ గౌర‌విస్తుందా?
X
జాతిపిత మ‌హాత్మా గాంధీని చంపేసిన నాథురాం గాడ్సేను దేశ‌భ‌క్తుడంటూ బీజేపీ నేత‌.. భోపాల్ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. ప్రజ్ఞాను తాను జీవితంలో క్ష‌మించ‌లేన‌ని.. ఆమెచేసిన వ్యాఖ్య‌లు స‌రికావ‌టం ప్ర‌ధాని మోడీ ఘాటు విమ‌ర్శ చేశారే కానీ ఆమె మీద ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు.

జాతీయ‌భావానికి.. దేశ‌భ‌క్తికి నిలువెత్తు ప్ర‌తిరూపాలుగా చెప్పే బీజేపీ.. సాధ్వీ ప్రజ్ఞా చేసిన వ్యాఖ్య‌ల‌పై తూతూ ఖండ‌న‌లు చేసి.. అది ఆమె వ్య‌క్తిగ‌త అభిప్రాయంగా తేల్చేశారే త‌ప్పించి.. జాతిపిత‌ను చంపిన హంత‌కుడ్ని దేశ‌భ‌క్తుడిగా కీర్తించిన త‌ప్పుపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ఇదిలాఉంటే.. తాజాగా ప్రజ్ఞా చేసిన దారుణ వ్యాఖ్య‌ల‌పై నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత కైలాష్ స‌త్యార్థి తాజాగా ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. మ‌హాత్ముడ్ని గాడ్సే చంపేస్తే.. ఆయ‌న ఆత్మ‌ను ప్రజ్ఞా సింగ్ చంపేశార‌ని తీవ్ర ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. ప్రజ్ఞాలాంటోళ్లు కేవ‌లం గాంధీ ఆత్మ‌నే కాదు.. అహింస‌.. శాంతి.. స‌హ‌నాల్ని కూడా చంపేశారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

గాంధీజీ రాజ‌కీయ పార్టీల‌కు అతీత‌మైన వ్య‌క్తిగా అభివ‌ర్ణించిన స‌త్యార్థి.. స్వ‌ల్ప రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పాకులాడ‌కుండా.. ప్రజ్ఞా సింగ్ లాంటి వారిని వెంట‌నే పార్టీ నుంచి బ‌హిష్క‌రించాల‌ని డిమాండ్ చేశారు. జీవితంలో సాధ్వీ ప్రజ్ఞాను క్ష‌మించ‌లేన‌ని ఉత్త మాట‌లు చెప్పే మోడీ.. స‌త్యార్థి చేసిన డిమాండ్ ను అమ‌లు చేయ‌గ‌ల‌రా?