Begin typing your search above and press return to search.

గోదావరిలో కృష్ణమ్మ అపూర్వ సంగమం..?

By:  Tupaki Desk   |   16 Sep 2015 4:56 AM GMT
గోదావరిలో కృష్ణమ్మ అపూర్వ సంగమం..?
X
నదుల అనుసంధానంలో తొలి అడుగు పడినట్లైంది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను కృష్ణమ్మతో అనుసంధానం చేసే ఘట్టానికి సంబంధించిన కార్యక్రమం ఇప్పటికే మొదలైనా.. బుధవారం ఈ ఘట్టం అవిష్కృతం కానుంది.

మరి.. ఈ అపూర్వ ఘట్టం ఎలా జరగనుందన్న విషయంలోకి వెళితే..

గోదావరి నదిపై పోలవరం వద్ద ప్రాజెక్టు నిర్మించి.. అక్కడ నుంచి కృష్ణా జిల్లా ప్రజల అవసరాలకు వాడుకుంటూ.. మిగిలిన నీటిని కృష్ణ నదితో సంగమం జరిపి.. వాటిని రాయలసీమ ప్రజలకు అందించాలన్నది ప్రయత్నం. అయితే.. ఈ వ్యవహారంలో పెద్ద తలనొప్పి ఏమిటంటే.. పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుందో అర్థం కాని పరిస్థితి. రాజకీయ వర్గాల వాదన ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి కావటం కష్టమేనని.. ఒకవేళ అయినా.. అది రానున్న నాలుగేళ్ల కాలంలో పూర్తి కావటం సాధ్యం కాని నేపథ్యంలో.. మధ్యేమార్గంగా.. తాత్కలికంగా పట్టిసీమతో ఆ పని పూర్తి చేయాలన్నది ఏపీ సర్కారు భావనగా చెబుతారు.

అందుకే.. పట్టిసీమ ప్రాజెక్టును హడావుడిగా తెరపైకి తీసుకొచ్చి.. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారని చెబుతారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పట్టిసీమ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదికి చేర్చటంతో రెండు నదుల అనుసంధానం పూర్తి కానుంది. ముందుగా అనుకున్నట్లుగా సమాయానికి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కాలేదు. దీంతో తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని గుడ్డి గూడెం వద్ద పోలవరం కుడి కాలువలోకి కలిపి ఆ నీటిని కృష్ణా నదికి తరలిస్తున్నారు.

అలా తరలించిన నీటిని కుడి కాల్వపై 171వ కిలోమీటరు వద్దున్న భలేరావు ట్యాంకు మీదుగా బుడమేరులోకి చేరేలా చేస్తారు. ఆ తర్వాత వెలగలేరు రెగ్యులేటర్ ను గోదారమ్మ దాటేసి.. బుడమేరు మళ్లింపు కాలువలోకి గోదావరి చేరుతుంది.

అనంతరం బెజవాడకు అత్యంత సమీపంలో ఉన్న ఇబ్రహీం పట్నం వద్ద కృష్ణా నదిలో కలవటంతో గోదారి.. కృష్ణమ్మ సంగమం జరిగినట్లుగా చెప్పొచ్చు. అంటే.. గోదారి నీరు వెలగలేరు రెగ్యులేటర్ ను దాటితే రెండు నదుల అనుసంధానం పూర్తి అయినట్లుగా చెప్పొచ్చు. పట్టిసీమ ప్రాజెక్టుతో 13 నుంచి 15 టీఎంసీల నీటిని కృష్ణకు చేర్చి.. వాటిని రాయలసీమ జిల్లాలకు చేరవేయొచ్చు.