Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు కౌంటరిచ్చిన జీఎన్ రావు

By:  Tupaki Desk   |   6 Jan 2020 6:37 AM GMT
చంద్రబాబుకు కౌంటరిచ్చిన జీఎన్ రావు
X
రాజధానిపై నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీ సిఫార్సులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు గట్టి కౌంటర్ పడింది. సీఎం ముఖ్య సలహాదారులు అజయ్ కల్లం చెప్పినట్టుగా జీఎన్ రావు నివేదిక ఇచ్చారని చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే..

దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన జీఎన్ రావు స్పందించారు. చంద్రబాబు ఆరోపణలను ఖండించారు. కమిటీలో సభ్యులను ప్రభావితం చేసి నివేదిక తయారు చేశారనడం అర్థరహితమన్నారు. ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేశామని స్పష్టం చేశారు. బ్రాంతితో బాబు మాట్లాడుతున్నాడని.. ఎవరి ప్రమేయం లేకుండా కమిటీ సభ్యులందరూ రహస్యంగా నివేదిక రూపొందించారని వివరించారు. అజయ్ కల్లం మార్గదర్శకాల ఆధారంగా నివేదిక తయారు చేశామని చంద్రబాబు అనడం నిరాధారమన్నారు.

జీఎన్ రావు కమిటీలో అపార అనుభవమున్న నిపుణులు, నిష్ణాతులు ఉన్నారని.. ప్రజలు, నిపుణులతో మాట్లాడి నివేదిక రూపొందించామని.. 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో పాటు అందరి అభిప్రాయాలు స్వీకరించామని తెలిపారు. తాము ఏపీకి రాజధానితోపాటు 13 జిల్లాల శ్రేయస్సు కోసం ఆలోచించి నివేదిక రూపొందించామని తెలిపారు. నివేదిక సమయంలో సీఎం సహా మంత్రులు, అధికారులు, ఎవ్వరి నుంచి సూచనలు తీసుకోలేదని స్పష్టం చేశారు.