Begin typing your search above and press return to search.

బీజేపీకి మరో షాక్ .. ఎన్డీఏ నుండి తప్పుకున్న జీజేఎం !

By:  Tupaki Desk   |   22 Oct 2020 3:50 PM GMT
బీజేపీకి మరో షాక్ .. ఎన్డీఏ నుండి తప్పుకున్న జీజేఎం !
X
కేంద్రం లో స్పష్టమైన మెజారిటీతో, తిరుగులేని పార్టీగా అవతరించి వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీకి మరో మిత్రపక్షం భారీ షాక్ ఇచ్చింది. గోరఖ్ జన్‌ ముఖి మోర్చా (జీజేఎం) .. పార్టీ ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్టు వ్యవస్థాపకుడు బిమల్ గురుంగ్ ప్రకటించారు. గత మూడేళ్ల నుంచి పరారీలో ఉన్న గురుంగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. పర్వతశ్రేణి ప్రాంతాల సమస్యల పరిష్కారిస్తామనే హామీ ఇచ్చిన బీజేపీ ఆ ప్రాంతాల అభివృద్దికి పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు.

వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ కు మద్దతు ఇవ్వనున్నట్టు చెప్పారు. మేము 12 ఏళ్ల నుంచి బీజేపీకి మద్దతుగా నిలిచాం. కానీ వాళ్లు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. అందుకే ఎన్టీయే నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో మేము బీజేపీకి గట్టి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాం. 11 గోర్ఖా కమ్యూనిటీస్ ‌కు గిరిజన హోదా ఇస్తానని చెప్పిన వాగ్దానాన్ని బీజేపీ నిలబెట్టుకోలేదు అని తెలిపారు. అంతేకాకుండా మ‌మ‌తా బెన‌ర్జీ ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంద‌ని, ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీను గెలిపించి బీజీపీకు త‌గిన బుద్ది చెబుతామ‌ని బిమ‌ల్ గురుంగ్ అన్నారు.

అయితే , మరో ఏడాదిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ సమయంలో ఎన్డీయే కూటమి నుంచి జీజేఎం తప్పుకోవడం బీజేపీకి ఒకరకంగా ఇబ్బందికరమైన పరిస్థితి అనే చెప్పవచ్చు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని గురుంగ్ చెప్పారు.అలాగే మూడోసారి సీఎం గా కావడానికి మ‌మ‌తా బెన‌ర్జీకి పూర్తిగా మద్దతు ఇస్తాం అని తెలిపారు. డార్జిలింగ్‌ ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం గురుంగ్‌ ఆధ్వర్యంలో చేసిన ఆందోళన తరువాత 2017 నుంచి పరారీలో ఉన్నాడు. అతడిపై మొత్తంగా 150కి పైగా కేసులు ఉన్నాయి.