Begin typing your search above and press return to search.

పనులు చేసినందుకు డబ్బులు ఇప్పించండి ఎమ్మెల్యే మేడం?

By:  Tupaki Desk   |   1 Jun 2020 10:10 AM GMT
పనులు చేసినందుకు డబ్బులు ఇప్పించండి ఎమ్మెల్యే మేడం?
X
చిలకూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ ఈ మధ్య మీడియాలో ఫోకస్ అవుతున్నారు. ప్రజల్లో హల్ చల్ చేస్తూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో తెగ పాపులారిటీని సంపాదించుకుంటున్నారు.

తాజాగా తన నియోజకవర్గంలోని నాడు-నేను పనులను ఎమ్మెల్యే విడదల రజినీ పరిశీలించారు. పనులు నత్తనడకన సాగడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు-నేడు కార్యక్రమానికి ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైనదని.. తీవ్ర జాప్యం చేస్తూ ప్రభుత్వానికి అధికారులు చెడ్డపేరు తెస్తున్నారని.. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే విడుదల రజినీ ఒంటికాలిపై లేచారు. ఎంఈవోలపై శివాలెత్తారు. అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఎమ్మెల్యే నాడు-నేడు పనుల జాప్యంపై ప్రశ్నించడం బాగానే ఉన్నా అలా ఎందుకు పనులు జరగడం లేదన్న విషయాన్ని మాత్రం ఆరా తీయకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. నాడు-నేడు పనులకు నిధులు సరిగా రానందున పనులు నత్తనడకన జరుగుతున్నాయని కాంట్రాక్టర్లు, అధికారులు వాపోతున్నారు. లాక్ డౌన్ లో కార్మికులు, ఇసుక సమస్య వాటిల్లింది. దీంతో ఇలాంటి వాటివల్లే పనులు ఆలస్యం అవుతున్నాయి.

కానీ విడుదల రజినీ ఇవేవీ పట్టించుకోకుండా సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం కాంట్రాక్టర్లు, అధికారులకు క్లాస్ తీసుకుంటే ఎలా అని ఆ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. ముందు నిధులు, విధులు సరిగ్గా ఇప్పించి ఆ తర్వాత పనులు కాకుంటే అడగాలని ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు.