Begin typing your search above and press return to search.

ముస్లింలు రాముని వారసులే: గిరిరాజ్

By:  Tupaki Desk   |   2 Oct 2018 11:45 AM GMT
ముస్లింలు రాముని వారసులే: గిరిరాజ్
X
కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రతిసారి ఏదో ఒక హిందుత్వ విషయంపై నోరుజారే ఈయన ఈసారి కూడా అలానే చేశారు. ముస్లింలంతా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సహకరించాలని.. వారంతా శ్రీరాముడి వారసులే అని కామెంట్ చేశారు. వారు మొఘల్ చక్రవర్తి బాబర్ కు వారసులు కాదంటూ చెప్పుకొచ్చారు. హిందువులకు ఓర్పు, సహనం నశిస్తే మధురా, కాశీలను లాగేసుకుంటారని హెచ్చరించారు.

ఇక ఒకవర్గం అధిక సంతానంపై కూడా గిరిరాజ్ చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. హిందువులు ఇద్దరు పిల్లలు కూడా కనలేరని.. అదే మరో వర్గం వారు ఇబ్బడి ముబ్బడిగా పిల్లలను కంటారని పరోక్షంగా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా గిరిరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన శివభక్తుడిలా బయట వ్యవహరిస్తారని.. కానీ శివుడిని పూజించే వారిని మాత్రం పక్కనబెడుతారని చెప్పుకొచ్చారు. మీరు నిజమైన హిందువులు అయితే గోమాంసం తినడం ఆపేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు మాత్రమే కాదు.. ప్రతిరోజు ఆలయాలను సందర్శించాలని సూచించారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఇటీవల భారతీయులంతా హిందువులేనని వ్యాఖ్యానించిన మాటలకు మద్దతుగా గిరిరాజ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.