Begin typing your search above and press return to search.

విప‌క్షంలో ఇంటి పోరు మొద‌లైంది

By:  Tupaki Desk   |   16 Jan 2017 10:24 AM GMT
విప‌క్షంలో ఇంటి పోరు మొద‌లైంది
X
తెలంగాణ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర చాటుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్న కాంగ్రెస్ నేత‌ల‌కు ఇందులో భాగంగా మ‌రో వార్త తెలిసివ‌చ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి దిగ్విజయ్ సింగ్‌ స్థానంలో గులాంనబీ ఆజాద్‌ రాష్ట్రానికి ఇన్‌ చార్జిగా రానున్నట్టు ప్ర‌చారం జరుగుతోంది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ఏఐసీసీ నిర్వహించిన సన్నాహక సమావేశానికి రాష్ట్రం నుంచి వెళ్లిన నేతలకు ఈ స‌మాచారం చెవిన ప‌డింది. దీంతో రాష్ట్ర నాయకులు పనిలో పనిగా డిగ్గీని కలువడంతోపాటు ఆజాద్‌ నూ కలిసినట్టు సమాచారం.

ఎన్నికల మేనేజ్‌ మెంట్‌ - ఇతర పార్టీలతో సమన్వయం చేయడంలో సిద్దహస్తుడు అని ముద్రపడ్డ ఆజాద్‌ ను తెలంగాణ రాష్ట్రానికి ఆయనను సెంటిమెంట్‌ గా భావిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న ప్ర‌ణాళిక‌లు ఫలించిన నేప‌థ్యం, ఇటీవ‌ల దిగ్విజ‌య్ సింగ్ తెలంగాణ వ్య‌వ‌హారాల‌పై ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో ఆజాద్‌ ను మ‌ళ్లీ ఇంచార్జీగా నియ‌మిస్తార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఆజాద్‌ - దిగ్విజ‌య్ సింగ్ స‌హా ఏఐసీసీ ఇత‌ర‌ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి పోటీ పడ్డారు. కొంత మంది గ్రూపుగా కలిస్తే...మరి కొందరు ఒంటరిగానే కలిసి తమ బాధలు చెప్పుకున్నట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల తర్వాత ఆజాద్‌ రాష్ట్ర వ్యవహరాల బాధ్యతలు చేపట్టే అకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలాఉండ‌గా...ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్ష - కార్యనిర్వాహక అధ్యక్షులను మారుస్తారని ప్రచారంలో ఉంది. దీంతో కొంత మంది సీనియర్‌ నేతలు చాపకింద నీరులా త‌మ‌కు అవ‌కాశం ద‌క్క‌క‌పోతుందా అనే కోణంలో అధిష్టానంతో మంతనాలు సాగిస్తున్నట్టు తెలిసింది. అధ్యక్ష పదవి కోసం కొంత మంది ప్రయత్నం చేస్తుండగా, ఇటీవల కొంత మంది నాయకులు ఉన్నట్టు ఉండి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కోసం కూడా పైరవీలు చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రస్తుత పార్టీ అధ్యక్షులు నమ్మకమైన వారితో సొంత టీమ్‌ ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టాక చాలా కాలం తర్వాత పాత కమిటినీ కొనసాగించిన ఆయన రెండు, మూడు నెలల క్రితం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులను నియమించారు. అందుకోసం పార్టీలో పెద్ద కసరత్తు చేసినట్టు స‌మాచారం. టీపీసీసీ కార్యదర్శులు - జాయింట్‌ సెక్రెటరీలను ఇంకా నియమించలేదు. దీనికి సీనియర్‌ నాయకులు గండి కొడుతున్నట్టు తెలిసింది. కాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కాబోయే అధ్యక్షుడిని తానేనంటూ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. రానున్న ఎన్నికల నిర్వహణ, పార్టీ గెలిపించే బాధ్యత తీసుకుంటానని ఆయన అధిష్టానానికి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్న వారు 2019 వరకు తామే ఉంటామని, వారిని నమ్ముకున్న వారికి భరోసా ఇస్తున్నట్టు తెలిసింది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, మీ సేవలకు గుర్తింపు ఉంటుందని చెబుతున్నారు. ఈ రకంగా పదవిలో ఉంటామంటూనే పదవిని కాపాడుకునేందుకు పైస్థాయి నేతలు పైరవీలు చేసుకుంటున్నారని స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/