Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు షాకిచ్చే కాంగ్రెస్ నేత.. రావట్లేదు..

By:  Tupaki Desk   |   13 Sep 2018 1:06 PM GMT
కేసీఆర్ కు షాకిచ్చే కాంగ్రెస్ నేత.. రావట్లేదు..
X
సీఎం కేసీఆర్ జోరుమీదున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ను ఆపడం ఎవరి తరం కావడం లేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ లో కుమ్ములాటలు - నాయకత్వం లోపాన్ని బేస్ చేసుకొని కేసీఆర్ చెడుగుడు ఆడుతున్నాడు. దీంతో కేసీఆర్ గుట్టు మట్లు - బలం - బలహీనత తెలిసిన నేతను రంగంలోకి దించాలని కాంగ్రెస్ అధిష్టానం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నా తెలంగాణ కాంగ్రెస్ లోని కోవర్టుల వల్ల అది సాధ్యం కావడం లేదట.. ఇప్పటికీ మూడు సార్లు ఆ సీనియర్ కాంగ్రెస్ నేత తెలంగాణ పర్యటన రద్దు కావడం వెనుక కాంగ్రెస్ లోని టీఆర్ ఎస్ కోవర్టులున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

సీనియర్ కాంగ్రెస్ నేత - ట్రబుల్ షూటర్ గులాంనబీ ఆజాద్ రాజకీయాల్లో ఆరితేరారు. ఎప్పటినుంచో ఆయన పార్టీ వ్యవహారాలు నిర్వర్తిస్తున్నారు. 2004లో ఏపీ కాంగ్రెస్ ఇన్ చార్జిగా ఉండి వైఎస్ సాయంతో ఏపీలో కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టడంలో కీలకపాత్ర పోషించారు. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తో పొత్తుపెట్టుకొని ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది.

ఇక ఇటీవల కర్ణాటకలో బీజేపీకి మెజార్టీ వచ్చినా జేడీఎస్-కాంగ్రెస్ కూటమి అధికారం సంపాదించిందంటే కారణం గులాంనబీనే.. ఆయన బెంగళూరులో మకాం వేసి కాంగ్రెస్ నేతలను ఒక్కతాటిపై తెచ్చి కర్ణాటకలో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు.

ఇంతటి బలమైన వ్యూహకర్త తెలంగాణ పర్యటన మూడుసార్లు వాయిదా పడిందట.. ఆయన రాకను తెలంగాణ కాంగ్రెస్ నేతలే అడ్డుకుంటున్నట్టు తెలిసింది. గులాంనబీ వస్తే కేసీఆర్ ఆట కట్టు అవుతుందని టీఆర్ ఎస్ కోవర్టులు ఏదోటి చెప్పి పర్యటన వాయిదా వేస్తున్నారట..

2004 నుంచి కేసీఆర్ గుట్టు మట్లు - బలం బలహీనత గులాంనబీకి తెలుసు. ఆయన వస్తే కేసీఆర్ కు ఇబ్బందులేననే చర్చ నడుస్తోంది. అందుకే టీఆర్ ఎస్ కోవర్టులు గులాంనబీ హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటున్నారట.. నిన్న జరిగిన సంగారెడ్డి సభకు గులాంనబీ రావాల్సింది. కానీ కొండగట్టు ప్రమాదం జరిగిందని బూచీ చూపి గులాంనబీని రావద్దని టీఆర్ ఎస్ కోవర్టులు అడ్డుచెప్పారట.. దీంతో ఆయన మూడోసారి తెలంగాణ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఇలా కేసీఆర్ ను ఢీకొట్టే కాంగ్రెస్ నేతను కావాలనే కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటుండడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.