Begin typing your search above and press return to search.

బూజుపట్టిన మిఠాయిలు అమ్మిన కరాచీ బేకరి.. రూ.10వేల ఫైన్

By:  Tupaki Desk   |   6 Jan 2022 6:30 AM GMT
బూజుపట్టిన మిఠాయిలు అమ్మిన కరాచీ బేకరి.. రూ.10వేల ఫైన్
X
కాదేది నిర్లక్ష్యానికి అనర్హం అన్నట్టుగా మారింది. తినే తిండి విషయంలో శ్రద్ధ చూపకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారులు ఎందరో ఉన్నారు. హైదరాబాద్ లో అయితే ఆహార కల్తీకి, కుళ్లిపోయే ఆహారాన్ని ప్రజలకు అంటగట్టే వారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలోనే బూజుపట్టిన మిఠాయిలు ఇచ్చిన ఓ బేకరికి వినియోగదారుడి ఫిర్యాదు మేరకు అధికారులు గట్టి షాక్ ఇచ్చారు.

హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ బేకరిపై జీహెచ్ఎంసీ అధికారులు కొరఢా ఝలిపించారు. మిఠాయిపై బూజు ఉందంటూ శనివారం ట్విట్టర్ వేదికగా అందిన ఫిర్యాదు మేరకు పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ స్పందించారు. ఖాజాగూడలోని కరాచీ బేకరిపై కేసు నమోదు చేసి జరిమానా విధించారు.

కరాచీ బేకరిలో కొన్న మిఠాయిలపై బూజు ఉందంటూ ఓ నెటిజన్ రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించాడు. బేకరీలో కొనుగోలు చేసిన మిఠాయి చెడిపోయిందని ఓ పౌరుడి ఫిర్యాదుతో చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈక్రమంలోనే ఖాజాగూడలోని కరాచీ బేకరిలో సోదాలు నిర్వహించిన అనంతరం సదురు ఫిర్యాదుపై జరిమానా విధించారు. కల్తీ నియంత్రణ అధికారులు బేకరి పరిసరాలు, వంటగదిని పరిశీలించారు. పరిశుభ్రత లేకపోవడం.. వ్యర్థాల కలబోత, ప్లాస్టిక్ వినియోగం.. మురుగు నీటి వ్యవస్థ సవ్యంగా లేకపోవడం కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో అక్కడికక్కడే రూ.10వేల జరిమానా విధించారు.

మిఠాయిలు, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ప్రయోగ శాలకు పంపించామని.. ఫలితం వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. కరాచీ బేకరికి చెందిన ఆహార పదార్థాల్లో నాణ్యత సరిగ్గా ఉండడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.