Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఓ కేతిగాడు..మ‌హేశ్ టీడీపీకి వ్య‌తిరేక‌మే

By:  Tupaki Desk   |   23 Jan 2018 4:39 PM GMT
ప‌వ‌న్ ఓ కేతిగాడు..మ‌హేశ్ టీడీపీకి వ్య‌తిరేక‌మే
X
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - టాప్ హీర్‌ మ‌హేశ్‌ బాబు బాబాయి ఘ‌ట్ట‌మ‌నేని శేష‌గిరిరావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ జ‌న‌సేన పార్టీ అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్‌ పై - మ‌హేశ్‌ బాబు పొలిటిక‌ల్ ఎంట్రీపై సంచ‌ల‌న కామెంట్లు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ..తోలుబొమ్మలాటలో కేతిగాడు వచ్చినట్టుగా మధ్యమధ్యలో వచ్చి మాట్లాడి వెళుతుంటారని ఎద్దేవా చేశారు.

రాజ‌కీయాల్లో పవన్ కల్యాణ్ పాత్ర సినిమాలో కామెడీ ఎపిసోడ్ లాంటిదని శేష‌గిరిరావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు మీట నొక్కితే అప్పుడు వచ్చి మాట్లాడి వెళిపోతుంటారని విమ‌ర్శ‌లు చేశారు. టీడీపీ ఏం కావాలంటే `జనసేన` పార్టీ అది మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ చేసే వ్యాఖ్యలకు అర్థం ఉండదని వ్యాఖ్యానించారు. ఏపీలో ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ...ప‌వ‌న్ ఎప్పుడైనా స్పందించారా అని ఆదిశేష‌గిరి రావు ప్ర‌శ్నించారు.

ఇక‌, త‌న సోద‌రుడు కృష్ణ - ఆయ‌న త‌న‌యుడు మ‌హేశ్‌ బాబు సినీ - రాజ‌కీయ జీవితం గురించి ఆదిశేష‌గిరి రావు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి మ‌హేశ్‌ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌శ్నించ‌గా...మహేశ్‌ ఏ పార్టీకి మద్దతు ఇవ్వ‌బోర‌ని..అలా ఇవ్వ‌క‌పోవ‌డ‌మే స‌రైన‌ద‌ని ఆయ‌న అన్నారు. మహేశ్‌ అందరికీ కావాల్సిన వ్యక్తి.. హీ ఈజ్ ఏ స్టార్. అందరికీ మహేశ్‌ కావాలి..మహేశ్‌ కు అందరూ కావాలి. మహేశ్‌ బాబు ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లకూడదు. ఒకవేళ, ఏ రాజకీయపార్టీకైనా మహేశ్‌ బాబు మద్దతిస్తానంటే... ‘వద్దురా' అని నేనే చెప్పొస్తా` అంటూ వ్యాఖ్యానించారు. అయితే గ‌త ఏడాది జ‌రిగిన నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీకి..."కృష్ణ - మహేశ్ సేన`` మ‌ద్ద‌తు ఇచ్చిన విషయమై ప్రస్తావించ‌గా... వైసీపీకి "కృష్ణ - మహేశ్ సేన" ఫ్యాన్స్ మద్దతివ్వడమంటే - ఆ పార్టీకి మహేశ్ బాబు మద్దతు ఇచ్చినట్టు కాదని అన్నారు.

సూపర్ స్టార్ కృష్ణ - ఆయన సేన ఎప్పుడూ టీడీపీకి వ్యతిరేకమేనని ఘట్టమనేని శేషగిరిరావు స్ప‌ష్టం చేశారు. ఇందుకు కార‌ణాలు వివ‌రించారు. కృష్ణకు రక్షణగా మొదలైన సేన.."కృష్ణ సేన". ఈ సేన ఎప్పుడూ టీడీపీకి వ్యతిరేకమే అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు తెలిపారు. ``1984లో రాయలసీమలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణ కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ బహిరంగ సభలో మాట్లాడి వస్తున్నారు. ఆ సమయంలో టీడీపీ పార్టీ కార్యాలయం మేడపై నుంచి రాళ్లు వేయడంతో కృష్ణ కంటికి దెబ్బతగిలి రక్తం వచ్చింది. వెంటనే, కర్నూలు ఆసుపత్రిలో దెబ్బ తగిలిన కంటికి ఆపరేషన్ చేయించుకుని - హైదరాబాద్ వచ్చారు. ఈ సంఘటనను తెలుగుదేశం పార్టీ వాళ్లు అధికారికంగా ఇంతవరకూ ఎవరూ ఖండించలేదు. మేడపై ఉన్న టీడీపీ ఆఫీసు నుంచి వచ్చి రాళ్లు పడ్డాయి. దుండగులెవరూ ఈ రాళ్లు విసరలేదు. ఈ సంఘటన నేపథ్యంలో పుట్టిందే...`కృష్ణ సేన` మహేశ్ బాబు ఎదిగే క్రమంలో అతనికి కూడా ఈ సేన మద్దతు ఇస్తూ `కృష్ణ - మహేశ్ సేన`గా మారింది. దీనికి ఆనాటి నుంచి నేను గౌరవాధ్యక్షుడిని. "కృష్ణ - మహేశ్ సేన" ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. కాంగ్రెస్ పార్టీకి ఈ సేన మద్దతుగా ఉండేది. మొన్నీ మధ్య వైసీపీకి మద్దతు ఇచ్చింది. ఈ సేన ఎప్పుడూ టీడీపీకి వ్యతిరేకమే` అంటూ తేల్చిచెప్పారు.