Begin typing your search above and press return to search.

గెట్ అవుట్‌..మీడియాపై సీఎం ఫైర్‌!

By:  Tupaki Desk   |   31 July 2017 4:31 PM GMT
గెట్ అవుట్‌..మీడియాపై సీఎం ఫైర్‌!
X
ఈ మ‌ధ్య ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉండే వ్య‌క్తులు కూడా సంయ‌మ‌నం కోల్పోతున్నారు. కొద్ది రోజుల క్రితం మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ క‌లెక్ట‌ర్ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. రెవెన్యూ శాఖ‌లో పెండింగ్ ఫైళ్ల‌ను ప‌రిష్క‌రించ‌క‌పోతే క‌లెక్ట‌ర్ల‌ను త‌ల‌కిందులుగా వేలాడ‌దీస్తా...అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. అదే త‌ర‌హాలో తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఫైర్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఓ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా విచ్చేసిన మీడియా ప్ర‌తినిధుల‌పై గెట్ అవుట్ అంటూ విజ‌య‌న్ ఆగ్ర‌హించిన‌ట్లు స‌మాచారం. ఈ ప్ర‌కారం కొన్ని ఇంగ్లిష్ వార్తా వెబ్ సైట్ల‌లో క‌థ‌నాలు వ‌చ్చాయి.

రెండు రోజుల కిందట ఆరెస్సెస్‌కు చెందిన కార్యకర్త హత్యకు గురయిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో కొంత ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా విజయన్‌ సోమవారం ఆరెస్సెస్‌ నేతలు, బీజేపీ నేతలతో తిరువనంతపురంలోని ఓ హోటల్‌ వద్ద ప్రత్యేక శాంతి సమావేశం చర్చలు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు. పిన‌రాయి విజ‌య‌న్ వ‌చ్చేస‌రికి కాన్ఫ‌రెన్స్ రూమ్ లో మీడియా ప్రతినిధులు, కెమెరామెన్‌లు పెద్ద సంఖ్య‌లో ఉన్నారు. అది చూసిన విజ‌య‌న్ హోట‌ల్ మేనేజ‌ర్ పై ఆగ్ర‌హించారు. వారిని ఎవ‌రు లోప‌లికి రానిచ్చారు? వారు బ‌య‌ట‌కు వెళితేనే నేను లోప‌లికి వ‌స్తా అని విజ‌య‌న్ అన్నార‌ట‌. మీడియా ప్ర‌తినిధుల‌నుద్దేశించి ...గెట్ అవుట్ ఫ్రం దిస్ రూం.... అని మండిప‌డిన‌ట్లు తెలిసింది. ఆ త‌రువాత మీడియా ప్ర‌తినిధులు అక్క‌డ నుంచి వెళ్లిపోయాక విజ‌య‌న్ లోపలికి వ‌చ్చి స‌మావేశం ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది.

ఒక వేళ తమకు నిజంగా లోపలికి అనుమతించనప్పుడు ముందే ఆ సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ మీడియా ప్ర‌తినిధులు మండిపడ్డారు. ఇటువంటి స‌మావేశాలకు హాజ‌రైన నేత‌ల ఫొటోలు - వీడియోలు తీసుకొని స‌మావేశం ప్రారంభం కాక ముందే అక్క‌డ నుంచి వెళ్లిపోవ‌డం మీడియాకు ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని జ‌ర్న‌లిస్టులు వాపోతున్నారు. అయితే, ఈ ఘ‌ట‌న‌పై సీఎంవో ఆఫీసు నుంచి భిన్న వాద‌న వినిపిస్తోంది. మీడియా ప్ర‌తినిధుల‌కు తాము ఆహ్వానం పంప‌లేద‌ని, అయినప్ప‌టికీ ఈ స‌మావేశానికి మీడియా ప్ర‌తినిధులు హాజ‌ర‌వ‌డంతో సీఎం విజ‌య‌న్ కోప్ప‌డ్డార‌ని సీఎంవో అధికారి ఒక‌రు తెలిపారు.