Begin typing your search above and press return to search.

జగన్ 'సభకు నమస్కారం'

By:  Tupaki Desk   |   24 Sept 2015 11:09 AM IST
జగన్ సభకు నమస్కారం
X
ఆంధ్రయూనివర్సిటీలో వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన యువభేరి కార్యక్రమంతో ప్రత్యేక హోదా విషయంలో విద్యార్థులకు ఎంతమేరకు అవగాహన కలిగిందో ... వారిలో స్ఫూర్తి రగిలిందో తెలియదు కానీ.. ఆరుగురు ప్రొఫెసర్లకు మాత్రం సెగ తగలనుంది... వారిపై చర్యలు తీసుకోవడానికి ఫైళ్లు రెడీ అవుతున్నాయి. ఉత్సాహంగా వారు జగన్ సభకు వెళ్లడమే కాకుండా అత్యుత్సాహంగా ప్రభుత్వంపై విమర్శలు కురిపించడంతో వారి పనిపట్టడానికి అంతా రెడీ అవుతోంది. వారిని సస్పెండ్ చేయాలా... లేదంటే ఇంకెలాంటి చర్యలు తీసుకోవచ్చు అన్న కోణంలో విశ్వవిద్యాలయ చట్టాలను ఇప్పుడు దుమ్మదులుపుతున్నట్లు సమాచారం.

ఏయూ ప్రొఫెసర్లు పీవీజీడీ ప్రసాదరెడ్డి - అబ్బులు - నారాయణ - పాండురంగారెడ్డి - శ్రీనివాసరావు - కోటిరెడ్డిలు జగన్ సభకు అటెండయ్యారు. వారిలో కొందరు ఆ సభలో మాట్లాడారు. అంతేకాదు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేశారట.. దీంతో ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు దీనిపై ఆగ్రహంగా ఉన్నారు. ఎవరెవరు వెళ్లారు... ఏమి మాట్లాడారు వంటి వివరాలన్నీ ఆయన ఇప్పటికే తెలుసుకున్నారు. వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని వీసీని ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనిపై తొలుత నివేదిక ఇవ్వాలని ఆయన వీసీని ఆదేశించారు.

అయితే... సభల్లో పాల్గొనడం, మాట్లాడడం తప్పేమీకాదన్న వాదన వినిపిస్తుండడంతో... వారి తీరు విశ్వవిద్యాలయ చట్టాల్లోని ఏ నిబంధలనకు ఉల్లంఘనవుతుందో చూడాలని ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. దీంతో యూనివర్సిటీ మాన్యువల్ మొత్తం తిరగేస్తున్నారట.