Begin typing your search above and press return to search.

టీడీపీకి బిగ్ షాక్..గంటా రాజీనామా ?

By:  Tupaki Desk   |   1 Oct 2020 5:37 PM GMT
టీడీపీకి బిగ్ షాక్..గంటా రాజీనామా ?
X
తెలుగుదేశంపార్టీకి రెండు మూడు రోజుల్లో బిగ్ షాక్ తగలటం ఖాయమనే అనిపిస్తోంది. విశాకపట్నం నగరంలో నార్త్ ఎంఎల్ఏ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అదే రోజు గంటా కొడుకు వైసిపి తీర్ధం తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ విషయంలో ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినట్లు వైపిపి వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి గంటా పార్టీలో ఇమడలేకపోతున్నాడు. ఎలాగైనా సరే వైసిపిలో చేరేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే.

అయితే గంటా ప్రయత్నాలను ఎప్పటికప్పుడు జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా అడ్డుకుంటున్నారు. తమ పార్టీలో చేరటానికి గంటా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు వీళ్ళద్దరు ఏకంగా మీడియా సమావేశంలోనే చెప్పటం అప్పట్లో సంచలనంగా మారింది. దాంతో కొద్దిరోజులు ప్రయత్నాలు చేసుకోవటం కొద్ది రోజులు స్పేస్ ఇవ్వటంతోనే గంటా ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుంది.

ఈ నేపధ్యంలోనే 3వ తేదీన గంటా కొడుకు వైసిపిలో చేరబోతున్నట్లు తాజాగా సమాచారం అందింది. అంటే ఈమధ్యనే విశాఖలోని మరో ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కుమార్ కూడా తన కొడుకును చేర్చిన విషయం అందరు చూసిందే. వాసుపల్లి చూపించిన దారిలోనే గంటా కూడా నడవబోతున్నట్లు అర్ధమవుతోంది. కాబట్టి గంటా మీద కూడా టీడీపీ ఆశలు వదిలేసుకోవాల్సిందే అన్నట్లుగా ఉంది. ఇదే సమయంలో 6వ తేదీన మరో ఎంఎల్ఏ గణబాబు కూడా పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం అందరికీ తెలిసిందే. పైన చెప్పినవి జరిగితే టిడిపికి మిగిలేది ఒక్క ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణమాత్రమే.

ఇపుడు జరుగుతున్న పరిణామాలు టీడీపీని కుదేలు చేస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. లీడర్లు పోయినా క్యాడర్ చెక్కుచెదరటం లేదని చంద్రబాబునాయుడు ఎన్ని చెప్పుకున్నా ఉపయోగం ఉండదు. ఎందుకంటే క్యాడర్ ను నడిపించే లీడర్లు లేనపుడు పార్టీ చుక్కాని లేని నావలాగ తయారవుతుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్దితి మరింత దారుణంగా తయారవుతుందనటంలో సందేహం లేదు.