Begin typing your search above and press return to search.

టీడీపీ నుంచి ఫిరాయించిన నేత‌కు మంచి ప‌ద‌వి ఇచ్చిన జ‌గ‌న్‌!

By:  Tupaki Desk   |   16 Sep 2022 8:30 AM GMT
టీడీపీ నుంచి ఫిరాయించిన నేత‌కు మంచి ప‌ద‌వి ఇచ్చిన జ‌గ‌న్‌!
X
గుంటూరు జిల్లా టీడీపీ మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్‌, ఆ పార్టీ అధికార ప్ర‌తినిధిగా ఉంటూ వైఎస్సార్సీపీలోకి ఫిరాయించిన గంజి చిరంజీవికి వైఎస్సార్సీపీలో మంచి ప‌ద‌వే ల‌భించింది. గంజి చిరంజీవి వైఎస్సార్సీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నియ‌మించారు.

అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి నారా లోకేష్‌పైన పోటీ చేసేది కూడా గంజి చిరంజీవేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. చేనేత సామాజిక‌వ‌ర్గానికి చెందిన గంజి చిరంజీవిని మంగ‌ళ‌గిరి బ‌రిలో నిల‌పాల‌ని జ‌గ‌న్ యోచిస్తున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

కాగా గంజి చిరంజీవి 2014లో టీడీపీ త‌ర‌ఫున మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి (ఆర్కే) చేతిలో కేవ‌లం 12 ఓట్ల తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యారు. ఆ త‌ర్వాత మంగ‌ళ‌గిరి మున్సిప‌ల్ చైర్మ‌న్‌గా ప‌నిచేశారు.

ఇక 2019 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి నారా లోకేష్ పోటీ చేయ‌డంతో గంజి చిరంజీవికి పోటీ చేసే అవ‌కాశం ద‌క్క‌లేదు. ఆయ‌న‌కు టీడీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ప‌ద‌విని ఇచ్చింది. అంతేకాకుండా మంగ‌ళ‌గిరి టీడీపీ అధ్య‌క్షుడుగానూ ఉన్నారు.

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల గంజి చిరంజీవి టీడీపీకి రాజీనామా చేశారు. బీసీల‌కు, ఎస్సీల‌కు, ఎస్టీల‌కు, మైనార్టీల‌కు న్యాయం చేసే పార్టీలో చేర‌తాన‌ని సంకేతాలు ఇచ్చారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కే ముందుగానే నిర్ణ‌యించుకున్న మేర‌కు వైఎస్సార్సీపీలో త‌న భార్య‌తో క‌లిసి చేరారు.

ఇప్పుడు ఆయ‌న‌ను వైఎస్సార్సీపీ అధినేత జ‌గ‌న్ రాష్ట్ర చేనేత విభాగం అధ్య‌క్షుడిగా నియ‌మించారు. మంగ‌ళ‌గిరి నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున గంజి చిరంజీవే పోటీ చేస్తార‌ని టాక్ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేయిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. లేదా ఆళ్ల‌కు ఈసారి సీటు ఇవ్వ‌కపోయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.