Begin typing your search above and press return to search.

నయీం నాలుగు మర్డర్లు.. పసికందు కూడా!

By:  Tupaki Desk   |   13 Aug 2016 3:30 PM GMT
నయీం నాలుగు మర్డర్లు.. పసికందు కూడా!
X
రాక్షసుడు ఎలా ఉంటాడనేదానిపై పౌరాణిక సినిమాల్లోనూ - అప్పుడప్పుడూ సాంఘిక చిత్రాల్లో విలన్ ల రూపంలోనూ - కథల పుస్తకాల్లోనూ మాత్రమే చూసిన, చదివిన అనుభవం ఉన్నవారికి ఇక ఆలోటు తీరిపోయినట్లేనేమో! పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన అనంతరం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న నయీం అకృత్యాలు చూస్తున్నవారికి కచ్చితంగా పైన చెప్పుకున్న రూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుందనడంలో సందేహం లేదనే చెప్పుకోవాలి. భూ కబ్జాలు - కిడ్నాప్ లు - బెదిరింపులు - బలవంతపు వసూళ్లు.. ఇవే కాదు నయీం అకృత్యాలు. మైనర్ బాలికలపై వికృత చేష్టలు - అత్యంత కిరాతకంగా హత్యలు - పసికందులను కూడా చంపిన దారుణాలు ఇలా చెప్పుకుంటూపోతే.. ఒక మనిషి తన జీవిత కాలంలో వినలేని - టీవీల్లో చూడలేని దారుణాలు ఒక్క నయీమే చేశాడంటే అతిశయోక్తి కాదేమో అనిపించకమానదు!

నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని అల్కాపురి టౌన్‌ షిప్‌ లో ఉన్న ఇతడి డెన్‌ లో జరిగినట్లు వెలుగులోకి వచ్చిన నాలుగు హత్యల గురించి తెలుసుకుంటే పైన చెప్పుకున్న విషయాలు పెద్ద ఆశ్చర్యంగా అనిపించవు. బాలికలకు మత్తమందులు ఇచ్చి వారిపై శారీరక - మానసిక అకృత్యాలకు పాల్పడే నయీం.. తాను చేస్తున్న రాక్షస పనులకు ఒప్పుకోని బాలికలను వారి సున్నిత అవయవాలపై కొడుతూ హింసించేవాడట. అలా హింసించినా కూడా లొంగని బాలికలను అత్యంత దారుణంగా చంపేవాడట. నల్లగొండకు చెందిన ఓ బాలిక ఇలాగే నయీమ్ అకృత్యాలను ఎదిరించింది. దీంతో నయీమ్ అండ్ కో ఈమెపై తల్వార్లు - గొడ్డళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఆ దృశ్యం చూసిన మిగిలిన మైనర్లు కొన్ని రోజుల పాటు అన్నపానీయాలు సైతం ముట్టుకోలేదంటే ఆ హత్య ఏ స్థాయిలో ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ హత్య అనంతరం మిగిలిన బాలికలతోనే ఆ హత్యచేసిన ఇంటిని శుభ్రం చేయించడంతో పాటు ఆమె మృతదేహాన్ని ఎక్కడికో తీసుకెళ్లి మాయం చేశాడట.

రెండు కాళ్లు - రెండు చేతులూ ఉండి బట్టలేసుకుని తిరుగుతూ - అన్నం తినే ప్రతివ్యక్తీ మనిషి కాదు అని చెప్పే సంఘటనగా ఇప్పుడు చెప్పబోయే విషయం బట్టి భావించవచ్చేమో! నెలల వయసున్న పనికందులను కూడా అక్రమంగా తనవద్దకు తెప్పించుకునే నయీం.. వారిని అమ్మడం - పెంచి పెద్దవారిగా చేసి విదేశాలకు తరలించడం వంటి పనులు కూడా చేసేవాడట. ఈ క్రమంలో ఒక పసికందును నేలకేసి కొట్టి మరీ ప్రాణాలు తీశాడట.

అలాగే ముగ్గురు వ్యక్తులు కలిసి శంషాబాద్‌ లో రూ.6 కోట్లకు కొన్న భూమి విషయంలో గొడవలు రావడంతో వీరిలో ఓ వ్యక్తిని మిగతా ఇద్దరూ సైడ్ చేశారట. దీంతో ఆ వ్యక్తి నయీమ్‌ ను కలిసి.. మ్యాటర్ సెటిల్ చేస్తే ల్యాండ్‌ లో 30% వాటా ఇస్తానని చెప్పడంతో రంగంలోకి దిగిన నయీం ఆ ఇద్దరినీ అత్యంత దారుణంగా చంపి..తనను మొదట కలిసిన వ్యక్తికే 30% వాటా ఇచ్చి ఆ స్థలాన్ని తానే సొంతం చేసుకున్నాడట.

కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించిన నార్సింగి పోలీసులకు ఫర్హానా - అఫ్షాల ద్వారా తెలిసిన అనేక కీలకాంశాల్లో ఇవి కొన్ని మాత్రమే! నయీమ్ అనుచరులు యువతులతో పాటు బాలికలను ఉపాధి పేరుతో వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినప్పుడు వారిని నయీమ్.. ఫర్హానా - అఫ్షాలకు అప్పగించేవాడట. ఇలా నయీం ప్రధాన అనుచరుల్లో ఈ ఫర్హానా - అఫ్షాలకు ప్రత్యేక స్థానముంది!