Begin typing your search above and press return to search.

గుంటూరులో క‌ల‌క‌లం: ‌యువ‌తి కోసం రెండువ‌ర్గాల గ్యాంగ్‌ వార్‌

By:  Tupaki Desk   |   8 Jun 2020 4:30 PM GMT
గుంటూరులో క‌ల‌క‌లం: ‌యువ‌తి కోసం రెండువ‌ర్గాల గ్యాంగ్‌ వార్‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో గ్యాంగ్ వార్‌ లు పెరుగుతున్నాయి. తాజాగా గుంటూరులో ప‌ర‌స్ప‌రం రెండు వ‌ర్గాలు దాడి చేసుకున్నాయి. అది కూడా ఓ యువ‌తి విష‌య‌మై గ్యాంగ్ వార్ జ‌రిగింది. దీంతో కొంత క‌ల‌క‌లం రేపింది. విజ‌య‌వాడ‌లో ప‌‌ర‌స్ప‌రం రెండు గ్రూపులు దాడి చేసుకున్న ఘ‌ట‌న‌లో ఓ వ్య‌క్తి మృతిచెందిన సంఘ‌ట‌న‌ను మ‌ర‌వ‌క‌ముందే ఇప్పుడు గుంటూరులో గ్యాంగ్‌ వార్ చోటుచేసుకుంది. గుంటూరు నగరం నడిబొడ్డున రెండు గ్రూపులు ఘర్షణకు దిగారు. స‌మాచారం అందిన వెంట‌నే పోలీసులు ప్ర‌వేశించ‌డంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది.

దానికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. గుంటూరులోని కృష్ణనగర్‌ కు చెందిన ఆవుల దీపేష్‌ బీటెక్‌ చదువుతున్నాడు. గతంలో తన క్లాస్‌ మేట్‌ తో అతడికి ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ తర్వాత ఆ యువతి దీపేష్‌ కు దూరమై వసంతరాయపురానికి చెందిన మరో క్లాస్‌ మేట్‌ ప్రణయ్‌ తో సన్నిహితంగా ఉంటోంది. అయితే దీపేష్‌ ఫోన్‌ నుంచి ఆ యువతికి పొరపాటున మెసేజ్‌ వెళ్లింది. ఈ విష‌యమై దీపేష్ - ప్రణయ్ మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. దమ్ముంటే డొంకరోడ్డు సెంటర్‌ కు రావాలని ప్రణయ్‌ సవాల్ చేశాడు. దీంతో దీపేశ్‌ - ప్ర‌ణ‌య్ త‌మ స్నేహితులతో క‌లిసి డొంక‌రోడ్డుకు చేరుకున్నారు.‌‌ సుమారు 30మందికి పైగా గుమికూడారు. ఈ క్ర‌మంలో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకుంటున్న స‌మ‌యంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. స్పెషల్‌ బ్రాంచ్‌ నుంచి సమాచారం అందడంతో ఇరువర్గాలు తలపడే సమయానికి అరండల్‌ పేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.